చైనా జోక్యం: ‘కశ్మీర్‌’పై మరోసారి రహస్య సమావేశం!

Sources Says UN Security Council Meet On Kashmir Tonight - Sakshi

న్యూఢిల్లీ:  జమ్మూ కశ్మీర్‌ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ) మరోసారి రహస్య సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌ మిత్రదేశం చైనా ఒత్తిడి మేరకు కశ్మీర్‌ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై బుధవారం నాటి సమావేశంలో చర్చించే అవకాశం ఉందని ఓ జాతీయ మీడియా పేర్కొంది. కాగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు చేసిన నాటి నుంచి దాయాది దేశం పాకిస్తాన్‌.. భారత్‌పై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ కశ్మీర్‌ అంశంలో ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కోరుతూ పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్‌ ఖురేషి గతంలో లేఖ రాశారు. అదే విధంగా ఈ విషయంలో చొరవ చూపాల్సిందిగా చైనాను కోరారు.

ఈ నేపథ్యంలో గతేడాది ఆగష్టులో చైనా ఒత్తిడి మేరకు యూఎన్‌ఎస్‌సీ రహస్య సమావేశాన్ని నిర్వహించింది. అయితే ఐరాసలో శాశ్వత సభ్యత్వం లేనందున పాక్‌కు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం లభించలేదు.  దీంతో​ తాజాగా చైనా సహకారంతో కశ్మీర్‌ అంశాన్ని మరోసారి యూఎన్‌ఎస్‌సీలో చర్చించేలా పాక్‌ పావులు కదిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక కశ్మీర్‌ తమ అంతర్గత విషయమని భారత్‌ ఇదివరకే పలుమార్లు అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐరాసలో శాశ్వత సభ్య దేశాలైన ఫ్రాన్స్‌, రష్యా, అమెరికా, బ్రిటన్‌లు భారత్‌ను సమర్థించగా.. కేవలం చైనా మాత్రమే పాక్‌కు పరోక్షంగా మద్దతు తెలుపుతోంది.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top