బాగా రద్దీగా ఉండే ఓ రోడ్డు... చాలా మంది పాదచారులు అవతలివైపు వెళ్లడం కోసం వేచి ఉన్నారు.. ఇంతలో వాహనాలకు రెడ్సిగ్నల్ పడి, పాదచారులు రోడ్డు దాటడానికి గ్రీన్ సిగ్నల్ పడింది..
లండన్: బాగా రద్దీగా ఉండే ఓ రోడ్డు... చాలా మంది పాదచారులు అవతలివైపు వెళ్లడం కోసం వేచి ఉన్నారు.. ఇంతలో వాహనాలకు రెడ్సిగ్నల్ పడి, పాదచారులు రోడ్డు దాటడానికి గ్రీన్ సిగ్నల్ పడింది.. అక్కడున్నవారంతా రోడ్డు దాటేదాకా సిగ్నల్ ఉంది.. కొంతసేపటి తర్వాత.. అదే చోట రోడ్డు దాటాల్సినవారు ఒకరిద్దరే ఉన్నారు.. ఈ సారి జస్ట్ ఒకే నిమిషంలో వారు దాటేయగానే ఆటోమేటిగ్గా.. వాహనాలకు గ్రీన్సిగ్నల్ పడింది... ప్రపంచంలోనే తొలిసారిగా లండన్లో పాదచారుల కోసం అమలుచేయనున్న కొత్త టెక్నాలజీ ఇది. ‘పెడెస్ట్రియన్ స్ప్లిట్ సైకిల్ ఆఫ్సెట్ ఆప్టిమైజేషన్ టెక్నిక్ (పెడెస్ట్రియన్ స్కూట్)’గా దీనిని పేర్కొంటారు.
రోడ్డు దాటడం కోసం వేచివున్న పాదచారుల సంఖ్యను అత్యాధునిక వీడియో కెమెరా ద్వారా గుర్తించి... దానికి అనుగుణంగా ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను ఇది నియంత్రిస్తుంది. ఎక్కువ మంది పాదచారులున్నప్పుడు ఎక్కువ సమయం తర్వాత.. ఒకరిద్దరు మాత్రమే ఉన్నప్పుడు వారు దాటిన వెంటనే.. వాహనాలకు గ్రీన్సిగ్నల్ ఇస్తుంది. అయితే, వాహనాల సంఖ్య ఆధారంగా ట్రాఫిక్ సిగ్నళ్లను నియంత్రించడానికి ఈ తరహా టెక్నాలజీని ఇప్పటికే టొరొంటో, బీజింగ్ వంటి పలు నగరాల్లో వినియోగిస్తున్నారు. పాదచారుల కోసం వినియోగించనుండడం ఇదే తొలిసారి కానుంది.