
దుబాయ్ లో వరదలు తగ్గుముఖం
ఎడారి దేశం యూఏఈలో వరదలు ముంచెత్తాయి. పాఠశాలలు మూతపడ్డాయి. విమాన సేవలకు అంతరాయం కలిగింది
అబుదాబి: ఎడారి దేశం యూఏఈలో వరదలు తగ్గుముఖం పట్టాయి. 24 గంటలుగా స్తంభించిన జనజీవనం ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోంది. నిన్న షార్జాకు వెళ్లే దారులన్నీ ట్రాఫిక్ తో నిండిపోగా, నేడు ఆ పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. జనాలు ఇప్పుడిప్పుడే రోడ్లమీదకి వస్తున్నారు. ఆఫీసులకు వెళ్లడం, ఇతర పనులకు వెళ్లే వాహనదారులు మళ్లీ తమ పనులను ప్రారంభించారు. కొన్ని విమాన సర్వీసులను అధికారులు పునరుద్ధరించారు.
ధారాపాతంగా కురిసిన ఈ అరుదైన వర్షాలతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో బుధవారం స్టాక్మార్కెట్ మూతపడిన విషయం తెలిసిందే. 240 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అటు వర్షాల కారణంగా దాదాపు 250 రోడ్డు ప్రమాద కేసులు నమోదయ్యాయని స్థానిక మీడియా తెలిపింది.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన నగరం దుబాయ్ సహా అక్కడి చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. 130కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, జోరువానలతో అక్కడి జనజీవనం స్థంభించింది. పాఠశాలలు మూతపడ్డాయి. విమాన సేవలకు అంతరాయం కలిగింది. ఈ అరుదైన వాతావరణాన్ని ప్రజలు ఆస్వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వర్షాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వెల్లువెత్తాయి. ఫేస్బుక్, ట్విట్టర్ లో వీడియోలు, ఫోటోలు పోస్ట్ లతో హంగామా నెలకొంది.
కాగా ప్రపంచ 10 అత్యంత పొడి ప్రదేశాలలో యూఏఈ కూడా ఒకటి. దేశ వార్షిక వర్షపాతం 78 మిల్లీమీటర్లు (మూడు అంగుళాలు). కానీ వాతావరణ, సిస్మాలజీ నేషనల్ సెంటర్ అధికారుల అంచనాల ప్రకారం తాజాగా 240 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీన్నిబట్టే అక్కడి వాతావరణ పరిస్థితిని మనం అంచనా వేయవచ్చు. మరోవైపు ఈ అసాధారణ వాతావరణ పరిస్థితులపై మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి.