బంద్‌ను పక్కదారి పట్టించేందుకే.. | Sakshi
Sakshi News home page

బంద్‌ను పక్కదారి పట్టించేందుకే..

Published Sun, Jul 31 2016 3:42 AM

బంద్‌ను పక్కదారి పట్టించేందుకే.. - Sakshi

అర్ధరాత్రి వైఎస్ విగ్రహం తొలగింపుపై వైఎస్సార్‌సీపీ నేతపార్థసారథి ధ్వజం

 సాక్షి, హైదరాబాద్ : ప్రత్యేక హోదాపై ఆగస్టు 2న రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్‌సీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో.. బంద్‌ను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం విజయవాడలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహ తొలగింపు కార్యక్రమానికి పూనుకుందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి పార్థసారథి దుయ్యబట్టారు. శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కొత్త రాజధానికొచ్చే వారికి రాజశేఖర్‌రెడ్డి విగ్రహం చూడగానే ఆ రాజన్న పాలన ఎక్కడ గుర్తుకొస్తుందోనన్న భయంతోనే చంద్రబాబు విగ్రహాన్ని తొలగించారన్నారు.

రాజశేఖర్‌రెడ్డి విగ్రహం నిజంగా ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించేలా ఉంటే.. అందరితో మాట్లాడి దానిని తొలగించి ఉండాల్సిందన్నారు. చంద్రబాబుకు నచ్చనివారి విగ్రహమైనా, మనుషులనైనా నిర్మూలించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. తొలగించిన విగ్రహాన్ని అదేస్థానంలో పునఃనిర్మించాలని జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. అధికారులు అక్కడే పునఃప్రతిష్ట చేయని పక్షంలో ప్రజలే వైఎస్ విగ్రహాన్ని నెలకొల్పుకుంటారన్నారు.  

 హోదా కోసం రాష్ట్రవ్యాప్త నిరసన:వైఎస్సార్‌టీఎఫ్
 సాక్షి, హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జాలిరెడ్డి, ఓబుళపతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement