అధికారపక్షానికి వైఎస్ జగన్ చురకలు

అధికారపక్షానికి వైఎస్ జగన్ చురకలు - Sakshi


-మీ తొమ్మిదేళ్లలో ప్రాజెక్టులకు ఎంత వ్యయం చేశారో చూశారా?

-మీరు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూంటే ఆశ్చర్యమేస్తోంది

-అధికార పక్షానికి చురకలంటించిన ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి

-వైఎస్ హయాంలో ప్రాజెక్టులకు చేసిన వ్యయం చదివినిపించిన ప్రతిపక్షనేత

-జీవో నెం.22, జీవోనె.63 లతో కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది ఎవరో అందరికీ తెలుసన్న నేత

-జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూండగా ఆరుసార్లు మైక్‌కట్




హైదరాబాద్: 'పాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు మాట్లాడుతూంటే చాలా ఆశ్చర్యమేస్తోంది. ప్రాజెక్టులు కట్టినోళ్లకంటే నీళ్లొచ్చినప్పుడు ఆ గేట్లు ఎత్తే లష్కర్లే గొప్పవాళ్లన్నట్టు బాబు చెబుతున్నారు' అంటూ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం అసెంబ్లీలో అంతర్జాతీయ జలదినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాగునీటి ప్రాజెక్టుల మీద మాట్లాడిన అంశాలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాస్తవాలను అసెంబ్లీలో చెప్పారు.



చంద్రబాబు నాయుడు... పులిచింతల, పోతిరెడ్డిపాడు, గాలేరునగరి, మంద్రినివా, పోలవరం కుడికాలువ, పట్టిసీమ ప్రాజెక్టులపై మాట్లాడుతూంటే ఆశ్చర్యమేస్తోందన్నారు. తోటపల్లి ప్రాజెక్టుకు నేనే శంకుస్థాపన చేశానంటున్నారు..దీని అంచనా వ్యయం 527.23 కోట్లయితే ఆయన తొమ్మిదేళ్ల కాలంలో ఖర్చు చేసింది కేవలం రూ.3కోట్లే. వైఎస్ తన ఐదేళ్ల హయాంలో రూ.398 కోట్లు ఖర్చు చేశారు. వైఎస్ మరణానంతరం రూ.51.95 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు తోటపల్లిని నేనే ప్రారంభిస్తున్నానని అంటున్నారు...అంటే ప్రాజెక్టులు కట్టిన వాళ్లకంటే నీళ్లొచ్చినప్పుడు గేట్లు ఎత్తే లష్కర్లు గొప్పవాళ్లని చంద్రబాబునాయుడు చెబుతున్నట్టుందని అన్నారు. వంశధార ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1242,90 కోట్లయితే బాబు తొమ్మిదేళ్ల హయాంలో కేవలం రూ.44.26 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అదే వైఎస్ ఐదేళ్ల హయాంలో రూ.657 కోట్లు ఖర్చు చేశారని, వైఎస్ మరణానంతరం రూ.138.96 కోట్లు వెచ్చించారన్నారు.



ఇక పుష్కరం ప్రాజెక్టు విషయానికొస్తే ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.608.04 కోట్లు అయితే బాబు హయాంలో ఖర్చు చేసింది రూ.7.60 కోట్లు మాత్రమేనని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ.384.64 కోట్లు ఖర్చు చేశారని, ఆయన మరణానంతరం రూ.61.77 కోట్లు వెచ్చించారని అన్నారు. తాడిపూడి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.467.70 కోట్లయితే బాబు తన హయాంలో కేవలం రూ.3.23 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వైఎస్ హయాంలో 384.64 కోట్లు అని, వైఎస్ మరణానంతరం రూ.55.19 కోట్లు వెచ్చించారని అన్నారు. వెంకటనగరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.124.18 కోట్లయితే బాబు తొమ్మిదేళ్ల హయాంలో ఒక్క రూపాయికూడా ఖర్చు చేయలేదని, అదే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ.75.54 కోట్లు ఖర్చు చేశారని, ఆయన మరణానంతరం 8.14 కోట్లు ఖర్చుచేశారన్నారు.



ముసురుమిల్లి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.207 కోట్లయితే బాబు హయాంలో పైసా ఖర్చు చేయలేదని, వైఎస్ హయాం ఐదేళ్లలో 148.97 కోట్లు వ్యయం చేశారని, వైఎస్ మరణానంతరం కూడా రూ.44.58 కోట్లు ఖర్చు చేశారన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.592.18 కోట్లయితే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లూ ఖర్చు చేసింది కేవలం రూ.2.20 కోట్లు అని, వైఎస్ తన ఐదేళ్ల పాలనలో రూ.536.23 కోట్లు ఖర్చు చేశారని, ఆయన మరణించిన తర్వాత రూ.32.12 కోట్లు ఖర్చు చేశారన్నారు. భూపతిపాలెం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.146.39 కోట్లయితే బాబు తన తొమ్మిదేళ్ల పాలనలో కేవలం రూ.4.98 కోట్లు మాత్రమే చేశారని, అదే వైఎస్ తన ఐదేళ్లలో రూ.124.34 కోట్లు ఖర్చు చేశారని దీన్నిబట్టి చూస్తే...చంద్రబాబు ప్రాజెక్టులపై మాట్లాడ్డం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదన్నారు.



కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది అందరికీ తెలిసిందే

కాంట్రాక్టు వ్యయం పెంచుకునేందుకు ఈపీసీ కాంట్రాక్టుల్లో పెంపుదల వెసులు బాటు లేకపోయినా జీవో నెం.22, జీవో నెం.63లను తెచ్చి కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు. ఈ జీవోల ప్రకారం మీరు నిర్ణయించుకున్న (సెలక్టివ్) కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పి, వ్యయం పెంచి వారికి లబ్ధికలిగేలా చేసింది అందరికీ తెలిసిందేనన్నారు.



ఇది ఎలా రిలవెంట్‌కాదు?

పదే పదే అంతర్జాతీయ జలదినోత్సవం సంబంధించినదే మాట్లాడాలని, దీనికి సంబంధించని అంశం మాట్లాడకూడదని స్పీకర్ అడ్డుకున్నారు. దీనిపై జగన్‌మోహన్‌రెడ్డి... ఇది ఎలా రిలవెంట్ కాదో చెప్పాలని అన్నారు. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టులకు ఎంత కేటాయించారు, ఇప్పుడు సీఎం అయ్యాక ఎంత కేటాయింపులు చేశారు అన్నది రిలవెంట్ ఎందుకు కాదు అన్ని ప్రశ్నించారు. పోలవరానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించే పరిస్థితి లేదు. చివరకు పట్టిసీమకు పెట్టే ఖర్చులు పోలవరం ప్రాజెక్టుల్లోనే చూపిస్తున్నారు. పట్టిసీమకు ప్రత్యేకంగా నిధులు కేటాయించలేని అధ్వాన్న పరిస్థితి ఉంది...ఇవన్నీ నీటికి సంబంధించినవి కాదా అని జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు గంట ప్రసంగం తర్వాత జగన్‌మోహన్‌రెడ్డికి మాట్లాడే అవకాశం ఇస్తే సుమారు 6 సార్లు అడ్డు తగిలి మైక్ కట్ చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top