
ఏవీ డబుల్?
మొత్తం 2,160 ఇళ్లకు అంచనా వ్యయం రూ.151.06 కోట్లు. సయ్యద్సాబ్కా బాడాలో జీప్లస్ 3 పద్ధతిలో ...మిగిలిన ప్రాంతాల్లో 9 అంతస్తుల్లో అపార్టుమెంట్లుగా నిర్మిస్తారు.
► టెండర్లు పిలిచినా ముందుకు రాని కాంట్రాక్టర్లు
► ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగింపు
► 31 వరకు ముచ్చటగా మూడోసారి...
మొత్తం 2,160 ఇళ్లకు అంచనా వ్యయం రూ.151.06 కోట్లు. సయ్యద్సాబ్కా బాడాలో జీప్లస్ 3 పద్ధతిలో ...మిగిలిన ప్రాంతాల్లో 9 అంతస్తుల్లో అపార్టుమెంట్లుగా నిర్మిస్తారు. వీటికి లిఫ్టులు, సెల్లార్లు ఉంటాయి. వీటి నిర్వహణకు గ్రౌండ్ ఫ్లోర్లో కొన్ని వాణిజ్యానికి వీలుగా నిర్మించి వాటిని అద్దెవ్వాలని యోచిస్తున్నారు.
సాక్షి, సిటీబ్యూరో:
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనుల్లో కదలిక కనిపించడం లేదు. ఐడీహెచ్ కాలనీ తర్వాత నగరంలో ఎక్కడా ఈ పనులు సాగుతున్న దాఖలాలు లేవు. గ్రేటర్ ప్రజలకు లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు హామీ ఇచ్చారు. తొలి దశలో గ్రేటర్లోని 24 నియోజకవర్గాల్లో... ఒక్కో ప్రాంతంలో కనీసం 400 ఇళ్లు నిర్మించాలని భావించారు. ఇప్పటి వరకు 11 ప్రాంతాల్లో శంకుస్థాపన చేశారు. ఒక్క చోట కూడా పనులు ప్రారంభం కాలేదు. తొమ్మిది బస్తీల్లో రూ.151 కోట్లతో 2,160 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించారు. దీనికి తొలి గడువు జనవరి 21తో... రెండో గడువు ఈ నెల 24తో ముగిసింది. అయినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో గడువును మార్చి 31 వరకు పొడిగించారు.
గిట్టుబాటు కాదని...
ప్రభుత్వం నిర్ణయించిన యూనిట్ ధరతో ఇళ్ల నిర్మాణం సాధ్యం కాదనే ఉద్దేశంతో ఎవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది. మరోవైపు స్థలం అందుబాటులోకి రావాల్సి ఉంది. వీటి నిర్మాణంపై ప్రభుత్వ విధానం కూడా స్పష్టంగా లేకపోవడంతో ఏ క్షణాన ఎలాంటి మార్పులు చేస్తారోననే సంశయంతో కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా... 9 అంతస్తుల్లో నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి అనుమతులు పొందాలంటే నిబంధనలు పక్కాగా అమలు చేయాలి. ఫైర్ సర్వీసెస్ నుంచి ఎన్ఓసీ పొందాలి. ఈ సాంకేతిక ఇబ్బందుల దృష్ట్యానూ కాంట్రాక్టర్లు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఐడీహెచ్ తరహాలో సాధ్యమేనా?
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మోడల్గా సికింద్రాబాద్ ఐడీహెచ్ కాలనీలో ఒక్కో యూనిట్ నిర్మాణానికి రూ.9.48 లక్షలు వెచ్చించారు. అవి జీ ప్లస్ టూ పద్ధతిలో నిర్మించారు. టెండర్లు పిలిచిన వాటిలో ఒక బస్తీ మినహా మిగతావన్నీ 9 అంతస్తులవే. ఎక్కడి వారికి అక్కడే ఇళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పద్ధతి ఎంచుకున్నారు. 9 అంతస్తులు కావడంతో యూనిట్ ధర తగ్గించినట్లు చెబుతున్నారు. వివిధ బస్తీల ప్రజలకు కౌన్సెలింగ్ చేసి.. సూత్రప్రాయంగా వారిని ఒప్పించినప్పటికీ... వారు ఉంటున్న ఇళ్లు ఖాళీ చేయించి... కాంట్రాక్టరుకు స్థలం అప్పగించేందుకు సమయం పడుతుంది.
నిర్మాణ సంస్థల ఆసక్తి
బహుళ అంతస్తుల ఇళ్ల నిర్మాణానికి ప్రముఖ సంస్థలు ఇప్పటికే ప్రభుత్వంతో చర్చించాయి. వీటిలో ఎల్ అండ్ టీ, ముంబైకి చెందిన టాటా హౌసింగ్, పుణేలోని చైనా కంపెనీ శాని, అదే నగరానికి చెందిన షిర్కే తదితరమైనవి ఉన్నాయి. అయితే అవి స్లమ్స్లో నిర్మాణానికి సుముఖంగా లేవని తెలుస్తోంది. విశాలమైన ఖాళీ స్థలాల్లో టవర్స్తో ఇళ్ల నిర్మాణానికే మొగ్గు చూపుతున్నాయి. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో నిర్మించనున్నందునప్రీ ఫ్యాబ్రికేటెడ్ తయారీకీ మూడు ప్రాంతాల్లో 15 ఎకరాలు కావాలని కొన్ని సంస్థలు కోరినట్లు తె లిసింది.
ఖరారు కాని విధి విధానాలు
విశాల మైదానాల్లో ఇళ్ల నిర్మాణంపై ఇంతవరకు స్పష్టత లేదు. వీటి ప్రభుత్వ నిధులు ఖర్చు చేయకుండా మొత్తం స్థలంలో 50 శాత ం నిర్మాణ కంపెనీకి ఉచితంగా ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన. రెండు టవర్లలో నిర్మాణాలు చేపడితే.. ఒక టవర్ను పూర్తిగా నిర్మాణ సంస్థకు ఉచితంగా ఇవ్వాలనేది మరో ఆలోచన. రెండు టవర్లకు మధ్య గోడ కడతారు. నిర్మాణ సంస్థ తమ టవర్ను పూర్తిగా వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించుకోవ చ్చు. ఈ రెండూ కాక మరో ఆలోచన కూడా చేసినట్లు తెలిసింది. యూనిట్ ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.3.8 లక్షలు భరించేందుకు ముందుకొచ్చే నిర్మాణ సంస్థలకు ఇవ్వాలనేది మూడో యోచన. ఇంకా ఏదీ ఖరారు చేయలేదు.
మౌలిక సదుపాయాలకు ఒక్కో ఇంటికి రూ.75 వేల వంతున రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది.
గ్రేటర్లోని 24 ప్రాంతాల్లో మొత్తం 8,650 ఇళ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పేదలకు ఉంటున్న చోటే ఇళ్ల నిర్మాణానికి సుముఖత వ్యక్తం చేసిన 9 బస్తీలకు మాత్రం తొలుత టెండర్లు ఆహ్వానించారు.
ప్రతిపాదనలు చేసిన బస్తీలు..
1. పిల్లిగుడిసెలు, 2.జంగమ్మెట్, 3.గోడేకిఖబర్, 4.కాంగారినగర్, 5.లంబాడితండా,6.ఇందిరానగర్, 7.దోబీఘాట్ (చిలకలగూడ), 8.హమాలీబస్తీ, 9.కట్టమైసమ్మ సిల్వర్ కాంపౌండ్, 10. సయ్యద్సాబ్కాబాడా, 11.పార్థివాడ, 12.అంబేద్కర్ నగర్(లంగర్హౌస్), 13.మంగాడి బస్తీ, 14.సార థి నగర్, 15.మైలార్దేవ్పల్లి, 16.చిత్తారం బస్తీ 17. కేశవ్నగర్ 18. పటాన్చెరు 19. భగత్సింగ్నగర్, 20.ఎరుకల నాంచారమ్మ నగర్, 21. సింగంచెరువు, 22.హరిజన బస్తీ (కౌకూరు), 23.కొత్తపేట ఎన్టీఆర్నగర్, 24. బహదూర్పురా.
ఇవి కాక మరో 23 ప్రాంతాలను కూడా అధికారులు ఎంపిక చేసినట్లు తెలిసింది.
ఐడీహెచ్ కాలనీలో ఇంటి విస్తీర్ణం: 580 చ.అ. జీప్లస్ టూ పద్ధతిలో నిర్మించారు.
ప్రస్తుతం టెండర్లు పిలిచినవి 560 చ.అ. వీటిని సెల్లార్ + 9 పద్ధతిలో నిర్మించనున్నారు.
ఐడీహెచ్ కాలనీ మాదిరిగానే లివింగ్ హాల్, మాస్టర్ బెడ్రూమ్, బెడ్రూమ్,
కిచెన్, రెండు రకాల టాయ్లెట్లు, బాత్రూమ్లు ఉంటాయి.
శంకుస్థాపన చేసిన ప్రాంతాలు
1.రసూల్పురా క్రాస్రోడ్
2.కట్టమైసమ్మ
సిల్వర్ కాంపౌండ్
3.లంబాడి తండా,
బాగ్లింగంపల్లి చౌరస్తా
4.శ్రీసాయిచరణ్ కాలనీ,
బాగ్లింగంపల్లి చౌరస్తా
5.కాంగారి నగర్
6.పిల్లిగుడిసెలు
7.సర ళాదేవినగర్
8.చిత్తారమ్మ బస్తీ
9.హమాలీ బస్తీ
10. చిలకలగూడ దోబీఘాట్
11. ఎరుకల నాంచారమ్మ నగర్
(మన్సూరాబాద్)
యూనిట్ వ్యయం.. వివిధ విభాగాల వాటా..
గ్రేటర్లో డబుల్ బెడ్రూమ్ ఇంటి వ్యయం: రూ.7 లక్షలు
ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా: రూ. 1.5 లక్షలు
రాష్ట్ర ప్రభుత్వ వాటా: రూ.3.8 లక్షలు
జీహెచ్ఎంసీ వాటా: రూ. 1.7 లక్షలు