రద్దయిన బొగ్గుబ్లాక్లపై సింగరేణి కన్ను
సుప్రీంకోర్టు రద్దుచేసిన బొగ్గుబ్లాక్లపై సింగరేణి కన్నేసింది. వాటికి త్వరలోనే కేంద్రం టెండర్లు పిలవనుంది.
తెలంగాణలోని బ్లాక్లన్నీ మాకే కావాలి
కేంద్రప్రభుత్వానికి అభ్యర్థన
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు రద్దుచేసిన బొగ్గుబ్లాక్లపై సింగరేణి కన్నేసింది. వాటికి త్వరలోనే కేంద్రం టెండర్లు పిలవనుంది. అయితే, గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా కొన్ని బొగ్గుబ్లాక్లను ప్రభుత్వరంగ సంస్థలకు కేటాయించి, మిగతా వాటికి వేలం నిర్వహించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. దీంతో అప్రమత్తమైన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఇటీవలే కేంద్ర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. తెలంగాణలో ఉన్న కోల్బ్లాక్లన్నీ తమకే కేటాయించాలని అభ్యర్థించింది.
అంతేకాక మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని కోల్బ్లాక్లను అప్పగించాలని కోరింది. సుప్రీంకోర్డు రద్దు చేసిన వాటిలో తెలంగాణకు చెందిన కరీంనగర్ జిల్లా తాడిచెర్ల బ్లాక్ ఒక్కటే రద్దయింది. గతంలో దీనిని కేంద్రం ఏపీ జెన్కోకు కేటాయించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంతో ఇది తెలంగాణ జెన్కో ఖాతాలో చేరింది. గతంలోనూ ఈ బ్లాక్ బాధ్యతలను సింగరేణి కంపెనీకే జెన్కో అప్పగించింది. కొత్త కేటాయింపుల్లో తాడిచెర్ల బ్లాక్ను తెలంగాణ జెన్కోకు ఇస్తే అభ్యంతరం లేదని, ఇవ్వని పక్షంలో తమకు కేటాయించాలని సింగరేణి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
కోల్ఇండియాతో సమంగా చూడండి
‘బొగ్గు ఉత్పత్తిలో సింగరేణికి అపారమైన అనుభవం ఉంది. యంత్ర పరికరాలతో పాటు నైపుణ్యమున్న మానవవనరులున్నాయి. కోల్ ఇండియా అధ్వర్యంలో ఉన్న బొగ్గు గనులతో పోలిస్తే సింగరేణి ప్రతికూల పరిస్థితుల్లో రాణిస్తోంది. ఇక్కడున్న బొగ్గుగనుల్లో మట్టిశాతం ఎక్కువ. మూడువంతుల మట్టి, ఒకవంతు బొగ్గు వస్తోంది. అయినప్పటికీ ఏటా 55 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం సాధిస్తున్నాం. ’ అని ఒక ఉన్నతాధికారి తెలిపారు. అందుకే సింగరేణిని కోల్ ఇండియా స్థాయిలోనే కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. బొగ్గుబ్లాక్ల కేటాయింపుల్లోనూ సమప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
2016 దాకా సరఫరా ఒప్పందాలు...
సింగరేణి తెలంగాణ, ఏపీల్లోని ఆరు ప్రధాన థర్మల్ కేంద్రాలు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు బొగ్గు సరఫరా చేస్తోంది. 2016 వరకు బొగ్గు సరఫరా ఒప్పందాలున్నాయని.. కొత్త పరిశ్రమల నుంచి అదేస్థాయిలో డిమాండ్ ఉం దని అధికారవర్గాలు తెలిపాయి. సుప్రీం కోర్టు ఇటీవల దేశవ్యాప్తంగా మొత్తం 218 బొగ్గు బ్లాకు ల్లో 214 బ్లాకులను రద్దు చేసింది. ఆ కంపెనీలు కొత్తవేలంలో పాల్గొనే అవకాశమున్నా, కొత్త నిబంధనలు తమకు కలిసొస్తాయని సింగరేణి ఆశిస్తోంది. బొగ్గుకు డిమాండ్ పెరుగుతున్నం దున ఏటా 140 మిలియన్ టన్నులు విదేశాల నుంచి దిగుమతి అవుతోందని, తమకు అదనపు బ్లాకులు కేటాయిస్తే ఉత్పత్తి పెంచుతామని కేంద్రానికి సింగరేణి నివేదించినట్టు తెలిసింది.


