నవ దంపతుల ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

నవ దంపతుల ఆత్మహత్య

Published Tue, Oct 27 2015 11:49 PM

newly married couple committed suicide

కుషాయిగూడ: కుటుంబ కలహాల కారణంగా నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... ఉత్తరాఖండ్, డెహ్రడూన్‌కు చెందిన దివాకర్‌కుమార్ (29) ఎన్‌ఎఫ్‌సీలో టెక్నీషీయన్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి గత ఫిబ్రవరిలో అదే రాష్ట్రానికి చెందిన  హిమానీదేవి (27)తో వివాహం జరిగింది. కొన్ని నెలలు వారి కాపురం సజావుగా సాగినా..ఇటీవల మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో భార్యభర్తలు తరచూ గొడవ పడేవారు.  దీంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు ఇటీవల వారికి సర్థిచెప్పారు.

అయినా వారిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో గత ఆదివారం కూడా వారి మధ్య ఘర్షణ జరిగినట్లు స్థానికులు తెలిపారు.  తరువాత ఏం జరిగిందో గాని ఇంట్లోని సీలింగ్‌ఫ్యాన్‌కు దంపతులిద్దరూ ఒకే చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం ఉదయం ఇంటి కిటీకిలోంచి గమనించిన ఇరుగు పొరుగు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ వెంకటరమణ తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశామని, వారిని విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
 
 

Advertisement
Advertisement