
ప్రేమ విఫలమై మెడికో బలవన్మరణం
ప్రేమ విఫలమై వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన నార్కట్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది.
నార్కట్పల్లి/వనస్థలిపురం: ప్రేమ విఫలమై వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన నార్కట్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్లోని వనస్థలిపురంలో నివాసం ఉండే తాడిచెర్ల సత్యనారాయణ పౌల్ట్రీ వ్యాపారి. ఇతనికి కుమారుడు రఘురామ్ (26), ఇద్దరు కూతుళ్లు సంతానం. చిన్న తనం నుంచి రఘురామ్ ఆటపాటలతో పాటు చదువులో ముందుండేవాడు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన రఘురామ్ ప్రస్తుతం నార్కట్పల్లిలోని కామినేని వైద్య కళాశాలలో పీజీ చదువుతూ అక్కడే గది అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. రఘురామ్ అదే కళాశాలలో చదువుతున్న ఓ యువతి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.
అయితే, వారి పెళ్లికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో వారం రోజులుగా రఘురామ్ తీవ్రమనోవేదనకు గురవుతున్నాడు. ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పి బాధపడ్డాడు. ఇదిలా ఉండగా.. శనివారం రాత్రి పొద్దుపోయే వరకు తండ్రి సత్యనారాయణ పలుమార్లు ఫోన్ చేసినా రఘురామ్ లిఫ్ట్ చేయలేదు. దీంతో కుమారుడికి నచ్చచెప్పేందుకు ఆయన తెల్లవారుజామునే నార్కట్పల్లికి వచ్చాడు. రఘురామ్ అద్దెకుంటున్న గదికి వెళ్లి తలుపుతట్టగా ఎంతకీ తెరవలేదు. దీంతో కిటికీలోంచి చూడగా మంచంపై కుమారుడు అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. వెంటనే సత్యనారాయణ విషయాన్ని పోలీసులకు తెలపడంతో ఎస్ఐ మోతీరామ్ ఘటన స్థలానికి చేరుకున్నారు.
స్థానికుల సహాయంతో తలుపులు తెరవగా అప్పటికే రఘురామ్ మృతి చెంది ఉన్నాడు. ప్రేమ విఫలం కావడంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని రఘురామ్ తన ల్యాప్టాప్లో సూసైడ్నోట్ టైప్ చేసినట్టు తెలిసింది. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మత్తుమందు తాగి, ఆపై ఊపిరాడకుండా ముఖానికి కవర్ చుట్టుకోవడంతో రఘురామ్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. సాయిరఘురాం మృతితో వనస్థలిపురం కాంప్లెక్స్ సమీపంలోని ఆయన నివాసం వద్ద తీవ్రవిషాద ఛాయలు అలుముకున్నాయి.