ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. వ్యవసాయ కేలండర్ ప్రకారం జూన్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు ఖరీఫ్ సీజన్గా పరిగణిస్తారు.
- నేటి నుంచి సెప్టెంబర్ 30 వరకు..
- వర్షాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న రైతులు
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. వ్యవసాయ కేలండర్ ప్రకారం జూన్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు ఖరీఫ్ సీజన్గా పరిగణిస్తారు. నైరుతి రుతుపవనాలు ముందొచ్చినా ఆలస్యమైనా ఈ తేదీ లనే ఖరీఫ్ సీజన్గా లెక్కిస్తారు. వాతావరణశాఖ అంచనా ప్రకారం ఈసారి రుతుపవనా లు ఆశాజనంగా ఉండే అవకాశం ఉంది. అయితే రుతుపవనాలు కాస్త ఆలస్యంగా వస్తాయని చెబుతున్నారు. రెండేళ్లుగా రాష్ట్రం తీవ్రమైన కరువులో కొట్టుమిట్టాడింది. ఈ సారి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయని వాతావరణ శాఖ చెబుతుండడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటికే కొందరు రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు. కాసింత వర్షాలు కురిసిన చోట దుక్కులు దున్నుతున్నారు.
వారం రోజులు ఆలస్యంగా..
ఈసారి నైరుతి రుతుపవనాలు వారం రోజులు ఆలస్యంగా కేరళను తాకనున్నాయి. తర్వాత వారం రోజులకు ఏపీలోకి ప్రవేశిస్తాయి. అనంతరం మూడు నాలుగు రోజు లకు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. 50 ఏళ్ల సరాసరి లెక్కల ప్రకారం నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ ఒకటో తేదీన కేరళను తాకాల్సి ఉండగా ఏడో తేదీన తాకుతాయని వాతావరణ శాఖ తెలిపింది. గతేడాది నైరుతి రుతుపవనాలు జూన్ 5న కేరళను తాకగా 13న తెలంగాణలోకి ప్రవేశించాయి. అయితే రుతుపవనాలు కేరళను తాకిన తర్వాత రాష్ట్రంలోకి ప్రవేశించడానికి ఒక్కోసారి 15-20 రోజులు ఆలస్యం కూడా కావొచ్చని అంటున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారం భమైనా ఇంకా వ్యవసాయశాఖ వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక విడుదల చేయలేదు.