నంద్యాల సర్వే నిషేధంపై జోక్యానికి నో | High Court order on Nandyal Survey Ban | Sakshi
Sakshi News home page

నంద్యాల సర్వే నిషేధంపై జోక్యానికి నో

Aug 22 2017 1:12 AM | Updated on Oct 19 2018 8:10 PM

నంద్యాల ఉప ఎన్నిక పూర్తయ్యేంత వరకు ఓటర్ల ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించిన సర్వే ప్రచురణ, ప్రసారాలపై నిషేధం విధిస్తూ రిటర్నింగ్‌ అధికారి జారీ చేసిన ఉత్తర్వుల విషయంలో జోక్యానికి ఉమ్మడి హైకోర్టు నిరాకరించింది.

కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం 
 
సాక్షి, హైదరాబాద్‌: నంద్యాల ఉప ఎన్నిక పూర్తయ్యేంత వరకు ఓటర్ల ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించిన సర్వే ప్రచురణ, ప్రసారాలపై నిషేధం విధిస్తూ రిటర్నింగ్‌ అధికారి జారీ చేసిన ఉత్తర్వుల విషయంలో జోక్యానికి ఉమ్మడి హైకోర్టు నిరాకరించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, రిటర్నింగ్‌ అధికారి, కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఓటర్ల ప్రజాభిప్రాయ సేకరణ సర్వే ప్రచురణ, ప్రసారాలపై నిషేధం విధిస్తూ రిటర్నింగ్‌ అధికారి ఈ నెల 15న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ స్వచ్ఛంద సంస్థ ‘స్పార్క్‌’ ఏపీ కార్యదర్శి నున్నా రాంబాబు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్‌ వాదనలు వినిపిస్తూ... రిటర్నింగ్‌ అధికారి జారీ చేసిన ఉత్తర్వులు ప్రజా ప్రాతినిధ్య చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. వాస్తవానికి ప్రజా ప్రాతినిధ్య చట్ట నిబంధనల్లో ఎన్నిక ప్రారంభం కావడానికి 48 గంటల ముందు నుంచి మాత్రమే సర్వే ప్రచురణ, ప్రసారాలపై నిషేధం ఉందని ఆయన కోర్టుకు నివేదించారు. 

Advertisement
 
Advertisement
Advertisement