విద్యార్థులకు రవాణా ఖర్చుల మంజూరు | Granted transportation charges to students | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు రవాణా ఖర్చుల మంజూరు

Jun 19 2017 3:30 AM | Updated on Sep 5 2017 1:56 PM

విద్యార్థులకు రవాణా ఖర్చుల మంజూరు

విద్యార్థులకు రవాణా ఖర్చుల మంజూరు

ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేని ఆవాస ప్రాంతాల్లోని విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు గాను రవాణా ఖర్చులు ఇచ్చేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది.

ప్రతి విద్యార్థికి నెలకు రూ.300 ఇచ్చేలా ఉత్తర్వులు  
 
సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేని ఆవాస ప్రాంతాల్లోని విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు గాను రవాణా ఖర్చులు ఇచ్చేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 17,619 మంది విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేవని విద్యా శాఖ గుర్తించింది. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న ఆయా విద్యార్థులకు నెలకు రూ.300 చొప్పున రవాణా ఖర్చులు ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 17,619 మంది విద్యార్థులకు రూ. 5.28 కోట్లు మంజూరు చేసింది.

సర్వశిక్షా అభియాన్‌ ప్రాజెక్టు అప్రూవల్‌ బోర్డు ఇందుకు ఆమోదం తెలపడంతో విద్యార్థులకు ఈ మొత్తాన్ని అందజేసేందుకు చర్యలు చేపట్టింది. ఒక కిలోమీటర్‌ పరిధిలో ప్రాథమిక పాఠశాలలు, 3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాలలు అందుబాటులో లేని ఆ విద్యార్థులకు ఈ మొత్తాన్ని అందజేయనుంది. ట్రాన్స్‌పోర్టు సదుపాయం వినియోగించుకునే విద్యార్థులు బ్యాంకు అకౌంట్‌ నంబర్లు, వారి వివరాలు, ఆధార్‌ నంబరు ఇస్తే ఆ మొత్తాన్ని అందజేస్తామని పేర్కొంది. ఇందుకు అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని డీఈవోలను పాఠశాల విద్యా కమిషనర్‌ కిషన్‌ ఆదేశించారు. 

Advertisement
 
Advertisement
Advertisement