లెక్కల చిక్కులు | BC Stats close | Sakshi
Sakshi News home page

లెక్కల చిక్కులు

Nov 23 2015 11:49 PM | Updated on Sep 3 2017 12:54 PM

లెక్కల చిక్కులు

లెక్కల చిక్కులు

బీసీల గణన గడువును పెంచినప్పటికీ లెక్కలు తేలక అధికారులు సతమతమవుతున్నారు.

తేలని బీసీ గణాంకాలు
 
సిటీబ్యూరో: బీసీల గణన గడువును పెంచినప్పటికీ లెక్కలు తేలక అధికారులు సతమతమవుతున్నారు. వాస్తవానికి బీసీ ముసాయిదాను మంగళవారం ప్రజల ముందుకు తేవాల్సి ఉన్నప్పటికీ... ఓటర్ల జాబితా వెలువరిస్తున్నందున దీన్ని మరో రెండు రోజులకు పొడిగించారు. ఈలోగా లెక్కలు సరి చేయాలని భావిస్తున్నారు. గ్రేటర్‌లో 2009లో బీసీలు 27.42 శాతం.. 2013లో 29.09 శాతంగా ఉన్నారు. కొత్త లెక్కల మేరకు ఎంత కసరత్తు చేసినా 27 శాతం కూడా కావడం లేదు. తాజా సమాచారం ప్రకారం 26.22 శాతం  ఉన్నట్లు గుర్తించారు. ఇంటింటి సర్వే చేసినట్లు.. బీసీల సంతకాలు.. ఫోన్ నెంబర్లు సేకరించినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ, చాలా మంది ప్రజలు తమ ఇళ్లకు ఎవరూ రాలేదని అంటున్నారు. పాత లెక్కలు ముందుంచుకొని ఈ కార్యక్రమాన్ని మమ అనిపించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్కిళ్ల వారీగా   ఎక్కడ తక్కువ ఉన్నారో అధికారులు అన్వేషించే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఖైరతాబాద్ (సర్కిల్-7బి)లో అత్యధికంగా 45.74 శాతం మంది బీసీలు ఉండగా... అత్యల్పంగా అబిడ్స్ (సర్కిల్-8)లో 16.02 శాతం మంది ఉన్నారు.

సర్కిళ్ల వారీగా ఇలా..
కాప్రా సర్కిల్‌లో 24.29 శాతం, ఉప్పల్‌లో 26.12, ఎల్‌బీనగర్-ఎలో 18.21, ఎల్‌బీనగర్-బిలో 20.95, సర్కిల్-4ఏలో 27.53, సర్కిల్-4బిలో 27.91, సర్కిల్-5లో 31.91, రాజేంద్రనగర్‌లో 32.28, సర్కిల్-7ఎలో 37.96, సర్కిల్-7బిలో 45.74 శాతం బీసీలు ఉన్నారు. సర్కిల్-8లో 16.02, సర్కిల్-9ఎలో 20.51, సర్కిల్-9బిలో 22.06, ఖైరతాబాద్-ఎలో 20.58, ఖైరతాబాద్-బిలో 24.55, శేరిలింగంపల్లి-1లో 24.45, శేరిలింగంపల్లి-2లో 19.90, పటాన్‌చెరు, ఆర్‌సీపురంలో 37.49, కూకట్‌పల్లి-ఎలో 20.10, కూకట్‌పల్లి-బిలో 20.02, కుత్బుల్లాపూర్‌లో 31.91, అల్వాల్‌లో 21.16, మల్కాజిగిరిలో 20.04, సికింద్రాబాద్‌లో 25.56 శాతంగా ఉన్నాయి.  
 
నిరసన

బీసీ గణన సవ్యంగా సాగలేదని వివిధ వర్గాల వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనుభవజ్ఞులైన ఎన్యూమరేటర్లతో సర్వేను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ సెల్ చైర్మన్ ఎం.నాగేష్‌ముదిరాజ్ సోమవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
 
ఉద్యమానికి సిద్ధం
 వార్డుల విభజన, డీలిమిటేషన్లలో అవతకవకలు జరిగాయని, వీటిని సరిచేయని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని టీడీపీ, బీజేపీలు హెచ్చరించాయి. సోమవారం టీడీపీ కార్యాలయంలో జరి గిన  సమావేశంలో టీడీపీ నాయకులు గోపీనాథ్, సాయన్న, బీజేపీ నాయకులు వెంకట్‌రెడ్డి, డా.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మంగళవారం ఇందిరా పార్కు వద్ధ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement