కేబుల్‌ చందాదారును మోసగించిన ‘ట్రాయ్‌’

Guest Column On TRAI New Rules For DTH - Sakshi

సందర్భం

కేబుల్‌ టీవీ డిజిటైజేషన్‌ వలన చందాదారుకు ఎంతో మేలు జరు గుతుందంటూ కేబుల్‌ టీవీ నియం త్రణ చట్టాన్ని సవరించే సంద ర్భంలో కేంద్ర ప్రభుత్వం  నమ్మబలి కింది. పారదర్శకత, ప్రసారాల నాణ్యత, కోరుకున్న చానల్స్‌కే చెల్లించే అవకాశం లాంటి మాయ మాటలు చెప్పింది. కానీ సామాన్య ప్రేక్షకులను బుట్టలో వేయటానికే ఈ అబద్ధాలు చెప్పిందన్నది ఇప్పుడు అందరికీ అర్థమవుతున్న  నిజం.  సగటున 15 నుంచి 20 చానల్స్‌ మాత్రమే చూసే ప్రేక్షకులకు వంద చానల్స్‌  అందుతున్న సమయంలో ఈ సంఖ్యను 500కు తీసుకుపోతా మంటూ చెప్పింది. అలా చానల్స్‌ పెరిగే కొద్దీ బిల్లు తడిసి మోపెడవుతుందని మాత్రం చెప్పలేదు. 

అనలాగ్‌ ప్రసారాల వలన కేబుల్‌ టీవీలు వంద చానల్స్‌ మించి ఇవ్వలేకపోతున్నాయని, అందువలన చందాదారు ఎంచుకునే స్వేచ్ఛకు భంగం కలుగుతోందని ప్రభుత్వానికి డిజిటైజేషన్‌ మీద చేసిన సిఫార్సులలో ట్రాయ్‌ చెప్పింది. డిజి టైజేషన్‌లో 500 చానల్స్‌ సైతం ఇవ్వగలిగే వీలుంటుందని చెప్పినా పంపిణీ సంస్థలకు మాత్రం 500 చానల్స్‌ ఇవ్వాలనే షరతు విధించలేదు.  

ఉచిత చానల్స్‌ ఎంచుకునే స్వేచ్ఛ చందాదారుడిదే అనేది మరో మోసం. స్వేచ్ఛ అంటున్నప్పుడు కనీసం 200 ఇవ్వ కుండా 100 ఎంచుకోమంటే దాన్ని స్వేచ్ఛ అనాలా? అలా 200 చానల్స్‌ ఎంతమంది ఎమ్‌ఎస్‌ఓలు ఇవ్వగలుగుతు న్నారు? పైగా ఆ 100 లోనే 26 దూరదర్శన్‌ చానల్స్‌ కచ్చి తంగా తీసుకోవాలి. మిగిలిన 74 చానల్స్‌ లో ఉచిత చానల్స్‌ తోబాటు మనం ఎంచుకునే పే చానల్స్‌ కూడా కలిసే ఉంటాయి. కాకపోతే పే చానల్స్‌కు అదనంగా చందా కడతాం.  

అంటే, ఈ 74 లో మనం కనీసం నాలుగు తెలుగు బొకేలు ఎంచుకున్నా 33 అయిపోతాయి. మిగిలేది 41. తెలు గులో ఉచిత చానల్స్‌ సంఖ్య దాదాపు 45.  ఆ విధంగా చూస్తే మనం కోరుకునే చానల్స్‌ సంఖ్య 100 దాటిపోతుంది. అది దాటాక ప్రతి 25 చానల్స్‌ కు రూ.20 వసూలు చేస్తారు. ఇదీ ట్రాయ్‌ చెప్పే రూ. 130 – వంద చానల్స్‌ వెనుక అసలు కథ.  పైగా ఇప్పుడున్న రూ.130  మరో ఆరు నెలల తరువాత పెంచుకోవటానికి పంపిణీ సంస్థలకు ట్రాయ్‌ అవకాశ మిచ్చింది. 

డిజిటైజేషన్‌ అనేది  సెట్‌ టాప్‌ బాక్స్‌ తోనే సాధ్యం. ఇది టీవీ యజమాని సమకూర్చుకోవాలని ప్రచారం చేశారు. కానీ, ఆ సెట్‌ టాప్‌ బాక్స్‌ ఒకేసారి డబ్బు పెట్టి కొనుక్కో వాల్సిన అవసరం లేదని, అద్దెకు కూడా తీసుకోవచ్చునని, వాయిదాల పద్ధతిలో ఇమ్మని కూడా మీ ఎమ్మెస్వో/ ఆపరేటర్‌ను అడగవచ్చునని ఆ ప్రచారంలో ఎక్కడా చెప్ప లేదు. చందాదారుల ప్రయోజనం ముఖ్యమైతే ఈ వెసులు బాటు గురించి కదా ప్రచారం చేయించాల్సింది? 

ఎవరైనా ఆ ఎమ్‌ఎస్‌ఓ సేవలు నచ్చక ఇంకొకరి పరి ధిలోకి వెళ్ళాలంటే ఆ బాక్స్‌ పనికి రాదు. ఇంటర్‌ ఆపరేట బిలిటీ లక్షణం వాటికి లేదు. అంటే, చందాదారుడు కొను క్కున్న బాక్స్‌ మీద పరోక్షంగా యాజమాన్యం మాత్రం ఎమ్‌ ఎస్‌ఓదే. అతడి పరిధిలో మాత్రమే అది పనికొస్తుంది. ఎవ రైనా మరో ఊరికి మారితే మళ్ళీ అక్కడ సెట్‌ టాప్‌ బాక్స్‌ కొనుక్కోవాల్సిందే. అప్పట్లో స్వదేశీ సెట్‌ టాప్‌ బాక్సులు తగినన్ని లేక దిగుమతి చేసుకోవటం వలన ఈ ఫీచర్‌ లేక పోయినా తీసు కోవాల్సి వచ్చిందనేది ట్రాయ్‌ వివరణ. హడా వుడిగా డిజిటైజేషన్‌ అమలు చేసిన ఫలితమిది.

డిజిటైజేషన్‌ వలన కేబుల్‌ బిల్లు తగ్గుతుందని ట్రాయ్‌ చెప్పటం అతిపెద్ద అబద్ధం. ఇప్పటికీ అదే అబద్ధం చెబు తోంది తప్ప వివరణ ఇవ్వటం లేదు. తగ్గటం, పెరగటం అనేది ఇప్పటి బిల్లుతోనే జనం పోల్చుకుంటారు. 200 చానల్స్‌ ఇచ్చే ఆపరేటర్‌ ప్రస్తుతం రూ. 200 వసూలు చేస్తున్నాడనుకుంటే ఇప్పుడు అవే చానల్స్‌కు బిల్లు లెక్కగడితే రూ.750కి తగ్గటం లేదు. ట్రాయ్‌ ఇప్పుడు చెబుతున్నదేం టంటే, ఆపరేటర్‌ ఇచ్చే చానల్స్‌ కాకుండా నిజంగా మీరు చూడాలనుకునే చానల్స్‌ కే లెక్కగట్టండి అంటోంది. అలా చూసినా రూ. 400 కి తగ్గేట్టు లేదు.

టారిఫ్‌ ఆర్డర్‌ 36 వ పేజీ 52వ పాయింట్‌ ఇలా ఉంది: ‘‘ట్రాయ్‌ అందరి అభిప్రాయాలూ లెక్కలోకి తీసుకున్న మీదట చానల్స్‌కు పూర్తి స్వేచ్ఛ, వ్యాపారంలో వెసులుబాటు ఇవ్వటం ద్వారా అవి సొమ్ము చేసుకునే అవకాశం ఇవ్వాలని భావించింది. అందుకే పే చానల్స్‌ కు వాటి కంటెంట్‌ తరహా ఆధారంగా ధర పరిమితి విధించకూడదని నిర్ణయించింది. అయితే తన పే చానల్స్‌ ధర నిర్ణయించేటప్పుడు  బ్రాడ్‌ కాస్టర్‌ పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తూ వివక్ష చూపకుండా, చందాదారుల ప్రయోజనాలు కాపాడతాడని ఆశిస్తున్నాం. అర్థవంతంగా ధర నిర్ణయించటం ద్వారా అధికాదాయం సంపాదించుకుంటాడని కూడా అంచనావేస్తున్నాం ’’. ఇది ట్రాయ్‌ చేసిన పెద్ద తప్పుడు అంచనా. బ్రాడ్‌కాస్టర్‌కు అవ కాశమిచ్చిన తరువాత తక్కువధర నిర్ణయించవచ్చునని ఆశించటమేంటి?.

ప్రేక్షకులు ఆసక్తి చూపని చానల్స్‌ను కూడా అంటగట్టే  బొకేల విధానాన్ని అదుపులో ఉంచటానికి ఒక నిబంధన పెట్టింది. బొకేలోని చానల్స్‌ విడివిడి ధరల మొత్తంలో డిస్కౌంట్‌ 15% మించకుండా బొకే ధర నిర్ణయించాలని చెప్పింది. ఇది కచ్చితంగా ధరలను అదుపు చేయటానికి వీలుండే అంశమే. అయితే మద్రాసు హైకోర్టు ఈ నిబం ధనను కొట్టివేసినప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళాలన్న కనీస జ్ఞానం ట్రాయ్‌కి లేకపోయింది. నెలలతరబడి ఆలస్యంగా  మేలుకొని వెళితే, మీరు ఇన్నాళ్ళూ నిద్రపోయారా అని సుప్రీంకోర్టు అడగ్గానే  పిటిషన్‌ వెనక్కు తీసుకుని ‘‘బ్రాడ్‌ కాస్టర్లు తగ్గిస్తే తగ్గవచ్చునేమో వేచి చూద్దాం’’ అని చెప్పటం ఎంత సిగ్గు చేటు? 

డిజిటైజేషన్‌ గురించి స్పష్టత ఇవ్వకుండా, సెట్‌ టాప్‌ బాక్స్‌ కొనకపోతే ప్రసారాలు ఆగిపోతాయని భయపెట్టటాన్నే అవగాహనగా చెప్పుకుంది. ఇప్పుడు కూడా ‘‘మేం అవకాశ మిచ్చినట్టుగా చానల్స్‌ నిర్ణయించుకున్న ధరలకు మీరు ఆమోదముద్ర వెయ్యకపోతే ఫిబ్రవరి 1 తరువాత మీకు టీవీ ప్రసారాలు ఆగిపోతాయి’’ అనే ప్రచారం మొదలైంది. 

నియంత్రణా సంస్థ అయిన ట్రాయ్‌కి చాలా విషయాల్లో నియంత్రణ లేదు. కేబుల్‌ నెట్‌వర్క్స్‌ను ఎమ్‌ఎస్‌ఓలు అమ్ము కుంటున్నప్పుడు వాటి పరిధిలో ఉన్న ఆపరేటర్లు, చందా దారుల ప్రయోజనాల సంగతేంటని పట్టించుకోదు. ఈ మధ్య కాలంలో రిలయెన్స్‌ జియో లాంటి సంస్థలు పెద్ద ఎత్తున కార్పొరేట్‌ ఎమ్‌ఎస్‌ఓలను సైతం కొంటూ ఉంటే ఎలాంటి సమాచారమూ లేకుండానే స్థానిక కేబుల్‌ ఆపరేటర్లు, చందా దారులు గొర్రెల్లా కొత్త యజమాని అధీనంలోకి వెళ్ళిపోతు న్నారు. ఇది కచ్చితంగా గుత్తాధిపత్యానికి దారి తీసి చందా దారుల మీద పెనుభారం మోపే ప్రమాదం ఉంది. అయినా ట్రాయ్‌ జోక్యం చేసుకోవటానికి ఇష్టపడటం లేదు. చందా దారుల ప్రయోజనాలు గాని, కేబుల్‌ ఆపరేటర్ల ప్రయోజ నాలుగాని కాపాడలేని నియంత్రణా సంస్థ ఎవరికి మేలు చేస్తు న్నదో ఆత్మ విమర్శ చేసుకోవాలి.

వ్యాసకర్త: తోట భావనారాయణ  సీనియర్‌ పాత్రికేయుడు
మొబైల్‌ : 99599 40194

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top