
పంటల పండుగ
ఇంగ్లిష్ క్యాలెండర్ ప్రకారం వచ్చే ఒకే ఒక్క హిందువుల పండుగ సంక్రాంతి.
కవర్ స్టోరీ
ఇంగ్లిష్ క్యాలెండర్ ప్రకారం వచ్చే ఒకే ఒక్క హిందువుల పండుగ సంక్రాంతి. సూర్యగ్రహం మకర సంక్రమణంతో వస్తుంది మకర సంక్రాంతి. ధ్రువ ప్రాంతంలో ఇక్కడ నుంచి పొద్దు పొడవడం మొదలవుతుంది. ఆరు నెలల చీకటి నుంచి ధ్రువ కుమారులు కళ్ళు తెరుస్తారు.
భారతీయులు కూడా ఒకప్పుడు అక్కడ నుంచే వచ్చారనీ, అక్కడి అలవాటు యిప్పటికీ కొనసాగుతోందనీ కొందరు విశ్లేషించారు. ఉత్తరాయణ పుణ్యకాలం అనేది కూడా యీ వెలుగు పక్షంతోనే వాడుకలోకి వచ్చిందంటారు. పూర్తిగా గ్రహచలనాలపై ఆధారపడి వచ్చే సందర్భం కాబట్టి ఏ మాత్రం తేడా లేకుండా తేదీకి కట్టుబడుతుంది.
సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు. ఇది నాస్తికులు కూడా అంగీకరించే సత్యం. శుచి శుభ్రత పట్టించుకోని భారతదేశాన్ని ఆ సూర్యుడే కాచి రక్షిస్తున్నాడని ప్రపంచమంతా చెప్పుకుంటుంది. దక్షిణాది రాష్ట్రాలకి పంటలు అందివచ్చే తరుణం యిది. దాంతో పెనుపండుగ అయింది. సంప్రదాయ వేత్తలు సంకురాత్రిని మూడురోజుల పర్వంగా విస్తరించారు. భోగి, సంక్రాంతి, కనుమ- యీ మూడు రోజులకూ సరిపడా ఆచారాలను నిర్దేశించారు. లోగిళ్ళ ముంగిట కళ్ళాపి జల్లి, తీరుతీరున రంగవల్లులు దిద్ది, భూదేవిని అలంకరించి పూజించడం నెల ముందే మొదలవుతుంది. ముగ్గులో బంతి, చేమంతి, గుమ్మడి పూలతో అలంకరించిన గొబ్బిళ్లను ఉంచుతారు. ధాన్యపు సిరులతో ఇళ్ళు కళకళలాడుతుంటాయి.
తెల్లారకుండానే పొగ మంచుని చీల్చుకుంటూ సాతాని జియ్యరు వస్తాడు. హరిలో రంగహరీ అంటూ గ్రామ సంకీర్తనం చేస్తూ తలపైని అక్షయ పాత్రని బియ్యంతో నింపుకుంటాడు. శివనామం స్మరిస్తూ ఘంటానాదంతో వస్తాడు జంగం దేవర. భిక్షవేసిన వారిని శంఖనాదంతో దీవిస్తాడు. డొక్క వాయిస్తూ శుభాలు పలుకుతూ వచ్చే బుడబుక్కల స్వామి పాత వస్త్రాల కోసం పేచీ పెడతాడు. అయ్యగారికి దణ్ణం పెట్టు అమ్మగారికి దణ్ణం పెట్టు అంటూ గంగిరెద్దులతో మేళంతో వచ్చే వాళ్ళు ముగ్గుల్లో గంగిరెద్దు ఆటలు ఆడిస్తారు.
తలకి నెమలికన్నుల పాగా చుట్టుకొని పొడుగాటి అంగీ వేసుకుని, నుదుట తిరునామం ధరించి గంటవాయిస్తూ వచ్చే చెంచుదొర పిల్లలకి నెమలీకలు పంచుతాడు. కోసిన కోతలు కొయ్యకుండా కోస్తూ విచిత్ర వేషధారణంతో వస్తాడు పిట్టలదొర. పగటి భాగవతులు, విప్రవినోదులు, దీవెన్ల పకీర్లు, మాసాబత్తిన వాళ్ళు, కొమ్మ దాసరులు, కాశీకావడి, దుర్గమ్మ పెట్టెతో పోతరాజు యింకా ఎందరో గుమ్మంలోకి వస్తారు. పంటరైతులు కాదు పొమ్మనరు.
నిన్నమొన్నటి దాకా గ్రామాలలో ఉన్న మిరాసీ పద్ధతి ప్రకారం, పనిచేసిన వారికి ధాన్య రూపంలో చెల్లింపులు జరుగుతాయి. కమ్మరం, కుమ్మరం, వడ్రంగం, నేత పనివారికి, రజక క్షురక వృత్తులతో నిత్యం సేవలందించే వారికి ఏడాది వేతనం యిస్తారు. అందుకని సంక్రాంతి సమయంలో భూస్వాముల యిల్లేకాదు పల్లెపల్లెంతా కొత్తధాన్యాల పరిమళంతో ఘుమ ఘుమలాడుతుంటుంది. తియ్యతియ్యని చెరకుగడలు అప్పుడే చేవపడతాయి. దోసెడుకో బంతిపూవన్నట్లు రకరకాల బంతులు పూస్తాయి.
తెలుగు జాతి పౌరుషాలకు ప్రతీకలుగా వర్రవర్రని మిరపపళ్లు కోతకు వస్తాయి. పంటచేను దిబ్బల మీద వంగలు, బెండలు, చిక్కుళ్లు, సొరపాదులు విరగకాసి బరువెక్కేది యిప్పుడే. కవిసమ్రాట్ విశ్వనాథ తన తెలుగు రుతువులు కావ్యంలో - మంచి గుమ్మడి పువ్వులో నిలిచిన మంచుబిందువు, తట్టలో కూర్చున్న పెళ్ళి కూతురులా వుందని వర్ణించారు. గుమ్మడి పచ్చపచ్చగా పూలు పూసేది, మంచుకురిసేది ఈ ధనుర్మాసంలోనే.
అలనాటి భోగి మంటలు కార్యక్రమంలో స్వచ్ఛభారత్ పోలికలు కనిపిస్తాయి. చెత్తా చెదారం మొత్తం తెచ్చి భోగిమంటలో వేసేవారు.
ముందువచ్చే భోగి పిల్లల పండుగ. భోగి పీడ విరగడ అవడానికి రేగి పళ్లు, రాగి డబ్బులు తలమీద పోస్తారు. పేరంటం చేసి ముత్తయిదువులతో పిల్లలకు దీవెనలు యిప్పిస్తారు. కన్నెపిల్లలు ఇళ్లలో బొమ్మల కొలువు పెట్టి, పేరంటం చేసి ఊరందరికీ ప్రదర్శిస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందంటూ పితృదేవతలను స్మరించుకుంటారు. కూష్మాండ దానం విధిగా చేయిస్తారు.
ఇక మూడోరోజు కనుమ. ఇది పశువుల పండుగ. పశువులను కడిగి పసుపుకుంకాలతో అలంకరిస్తారు. మెడలో బంతిపూల దండలు వేస్తారు. ఏడాది పొడుగునా ఎండనకా రేయనకా తనకు అండదండగా ఉన్నందుకు రైతు యీ విధంగా కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. ఏరువాక పున్నమికి మెడమీద కాడి వేసుకుంటే సంకురాత్రి దాకా దున్నకి దుక్కిటెద్దుకి కాడి తీసే అవకాశం ఉండదు. పండిన ధాన్యాలని గాదెల్లో నింపి, తమ గ్రాసం గడ్డిని వాములు వేస్తే వాటికి కాస్త తీరిక.
ఆ తీరికలో వస్తుంది యీ పెద్ద పండుగ. ఆసామి శారీరకంగా మానసికంగా కాస్త విశ్రాంతిగా ఉంటాడు. అందుకే కోడి పందాలు, పొట్టేలు పందాలు జోరుగా ఆడతాడు- మీసాలు దువ్వుతూ. పంట చేలపై పరిగ పిట్టలు పిచ్చుకలు అలుపు సొలుపు లేకుండా ముక్కులతో గింజలేరుతూ గుంపులు కనిపిస్తాయి. సూర్యనారాయణమూర్తికి కొత్తబియ్యం, కొత్త బెల్లం, ఆవుపాలతో కొత్తకుండలలో పొంగళ్ళు పెడతారు. ఆరుబయట పొంగళ్ళు పొంగుతుంటే సూర్యదేవుడు తన కిరణాలతో గ్రోలి ఆశీర్వదిస్తాడని జానపదుల నమ్మకం.
ఇవన్నీ ఒక నాటి అచ్చట్లు ముచ్చట్లు.... మరిప్పుడో...?
ఆనాడు వ్యవసాయం జీవనం. నేడుకాదు. అందువల్ల శ్రమ జీవులు, వినోదాలు, అవసరాలు వ్యవసాయదారుని ఆశ్రయించుకుని అతని చుట్టూ తిరిగాయి. క్రమంగా స్థితిగతులు మారిపోయాయి. వ్యవసాయానికి నాగలి నుంచి కొడవలి దాకా ఎన్నో పనిముట్లు కావాలి. అందుకోసం వడ్రంగి కమ్మరి వుండి తీరాలి. పొలానికి యింటికి బానలు, బుంగలు, కడవలు, పిడతలు, చట్లు, మూకుళ్ళు, ప్రమిదలు కావాలి. కుమ్మరం కావాలి. కారణాలు ఏవైనా పల్లెలు ఛిద్రమైనాయి.
ఊళ్ళకి కళ తప్పింది. అనేక జానపద కళారూపాలు, జానపద వాద్యాలు కనుమరుగైనాయి. బతుకు తెరువు కోసం కొత్తకొమ్మలను వెదుక్కుంటూ వెళ్ళిపోయాయి. ఈ దారిలో కొన్ని జారిపోయాయి. కొన్ని దారి తప్పాయి. మొత్తం మీద ఒక గొప్ప పనితనాన్ని, సంస్కృతిని కోల్పోయిన మాట వాస్తవం. అగ్గిపెట్టిలో చీరను పెట్టిన శిల్పం మనది. ఆ చీరకు నూలు తీసిన కళాకారుల హస్తవాసిని తిరిగి చూడగలమా? కొయ్యని బంగారం చేసే వడ్రంగి, ఇనుముని పుత్తడి చేయగల కమ్మరి, బంకమట్టిని సారెతో సువర్ణం చేసే కుమ్మరి మన కళ్లెదుట కనుమరుగైన కులవృత్తి బ్రహ్మలు.
అరిశెలు, బెల్లపులడ్లు, కొమ్ము మిఠాయి, చకినాలు, చక్కలు సంక్రాంతి పిండి వంటలు. నాలుగిళ్ళ వారు చేరి సమష్టిగా యివన్నీ చేసుకుని బానలకు ఎత్తేవారు. కొత్త అల్లుళ్లు రావడం వేడుక. పాత అల్లుళ్ళు రావడం వాడుక. ఊరు మీద ఊరు వచ్చి పడినట్టుండేది. ఇప్పుడు సొంత ఊళ్ళలో అంతో యింతో వేళ్ళున్న వాళ్లు నగరాల నుంచి పండక్కి వెళుతూనే ఉన్నారు.
అలనాటి భోగి మంటలు కార్యక్రమంలో స్వచ్ఛభారత్ పోలికలు కనిపిస్తాయి. చెత్తా చెదారం మొత్తం తెచ్చి భోగిమంటలో వేసేవారు. అదొక ఉద్యమంలా ఉత్సవంలా నడిచేది.
ఇప్పుడు గ్రామాలకు వెళితే వెతికి చూసినా శ్రమించే పశువులు కనిపించవు. అక్కడక్కడ మాత్రం పాలిచ్చే పశువులు కనిపిస్తాయి. ఒక ట్రాక్టర్ వంద ఎడ్లు చేసే పని చేస్తుంది. డీజిల్ తప్ప వేరే పోషణ భారం ఉండదు. రైతుకి యిప్పుడు పూర్వం లాగా ఎడ్లకి దున్నలకి కృతజ్ఞతలు చెప్పే పనిలేదు. కనుమపండుగకి యిప్పుడు అర్థమే లేదు. మనకి సెంటిమెంట్లమీద భయం ఎక్కువ. అందుకని ఎక్కడున్నా పిల్లల తలమీద భోగిపళ్ళు పోసి ఊపిరి పీల్చుకుంటారు.
బస్తీల్లో, నగరాల్లో బొమ్మల కొలువులు స్టేటస్ సింబల్ అయినాయి. ఇటాలియన్ మార్బుల్స్ని, యూరోపియన్ క్రిస్టల్స్ని గొప్పింటి పేరంటంలో చూడొచ్చు. సినిమాల్లో తరచుగా సంక్రాంతి సన్నివేశాలు కనిపిస్తూంటాయి. పూర్తిగా స్టూడియో సెట్టింగ్లతో, చిత్ర విచిత్రమైన వేషధారణలో నాయికా నాయకులతో పాటు యింకా కొందరు ఆడామగ నృత్యాలు చేస్తూ పాటలు పాడుతుంటారు.
సాతాని జియ్యరు ఖరీదైన కాస్ట్యూమ్స్లో ఓ క్షణం కనిపించి వెళ్తాడు. గంగిరెద్దుల్ని ఆడించే యిద్దరూ జీన్స్ వేసుకుని సన్నాయి ఊదుతున్నట్టు నటిస్తూ ఉంటారు. గంగిరెద్దు మెరిసిపోయే బొంతలతో స్టూడియో తాలూకు ఎద్దులా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని నేటివిటీకి దర్పణంగా భావిస్తారు. కాని తెలిసిన ఏ ప్రేక్షకుడూ అలా పొరబడడు. శిల్పారామంలో కూడా యీ తంతు ఒక వేడుకగా మారింది.
భూస్వాముల యిల్లేకాదు పల్లెపల్లెంతా కొత్తధాన్యాల పరిమళంతో ఘుమఘుమలాడుతుంటుంది.
అంతరించి పోయిన వాటి గురించి ఆలోచించనక్కరలేదు. వాటి తాలూకు కొన్ని తీపి గురుతులు మరోచోట మరోవిధంగా మిగిలే ఉంటాయి. ఇది టెక్నాలజీ యుగం. దీని వేగం వేరు. ఒక సెల్ఫోన్ కేవలం నాలుగైదేళ్ళలో మాటల్లోనే మాటల్తోనే విస్తరించి పోయింది. ఒక రెంచ్ని ఒక పట్కారుని కాంతి వేగంతో రోదసిదాకా పంపగల టెక్నాలజీ మనిషి చేతిలో ఉంది. ఎప్పుడూ మనిషి గతంలోకి తొంగిచూస్త్తూనే ఉంటాడు. రెండు తరాల క్రితం పండుగలు వేడుకలు ఎలా జరిగాయో వింటూనే వుంటాడు. శిథిలమైపోయిన సంస్కృతిని పునర్నిర్మించి ఆనందించాలనే అనుకుంటాడు.
మనిషి ప్రకృతిలో ఒక చిన్న భాగం. నాగరికత ముదరక ముందు కొండకోనలతో నదీనదాలతో జంతువులతో పక్షులతో కలుపుగోలుగా జీవించాడు. మేధస్సు విజృంభించి ఆకాశాన్ని దాటి ఎదిగాడు. భూగోళాన్ని దాటి విస్తరించాడు. ప్రకృతికి దూరంగా జరిగాడు. ఒక జలపాతాన్ని, పురివిప్పిన నెమలిని, ఆకాశమంతా విరిసిన ఇంద్రధనుస్సుని చూసి ఆనందించే మనోస్థితిని కోల్పోయాడు. ఇంద్రధనుస్సు ఎలా ఎందుకు వస్తుందో అతనికి తెలుసు. జలపాతమంటే నీళ్ళధార కిందపడడం.
అంతరించి పోయిన వాటి వాటి తాలూకు తీపి గురుతులు మరోచోట మరోవిధంగా మిగిలే ఉంటాయి.
నెమలి పురివిప్పడం జువాలజీ. అంతే కదా! పూర్వకవులు పల్లెపట్టులని అందంగా చూసి అంతకు పదింతలుగా తమ కవిత్వంలో అందించారు. శ్రీనాథ మహాకవి దక్షారామంలో, భీమేశ్వర పురాణంలో, పల్నాటి వీర చరిత్రలో, ఆశువులలో పల్లెసీమలను కళ్ళకు కట్టించాడు. విశ్వనాథ, పింగళి కాటూరి, నండూరి ఎంకి పాటలు, తుమ్మల సీతారామమూర్తి, జాషువా తెలుగు జానపద శోభలను ఆపేక్షగా పరామర్శించారు. జానపద సాహిత్యంలో ప్రతి పదంలో పండుగ ఉంటుంది. అక్కడ సంకురేతిరి ఉంటుంది.
ఇది సర్వశుభాలు యిచ్చే సూరీడు పండుగ. అందుకని యిది ఆచంద్రతారార్కం ఏదోరకంగా మనం జరుపుకుంటూనే ఉంటాం. ఇది వరకు మనం సూర్యుడితో పన్నెండు గంటలే గడిపేవాళ్ళం. ప్రపంచీకరణ తరువాత అన్ని గంటలూ ఆ ప్రత్యక్ష నారాయణునితోనే కదా బతుకు నడుస్తోంది! ఇక మన భవిష్యత్తు, మనకున్న తరగని ఆస్తి సౌరశక్తి ఒక్కటే.