చిన్న చిన్న పాఠాలు

Teachers Day Special Story - Sakshi

గురువు అంటే బెత్తం పట్టుకుని బడిలో తారసపడే వ్యక్తి మాత్రమేనా? అభ్యాసంలో చేయి పట్టి నడిపించేవాడు మాత్రమేనా? తప్పులను దండించి సరిదిద్దేవాడు మాత్రమేనా? ఒక్క చదువులో సాయం పట్టేవాడు మాత్రమేనా? దారి పొడవున ఎందరో గురువులు. ఎన్నో మలుపులు. ఎన్నోచోట్ల ఎందరో గురువులు తారసపడి జీవితాన్ని ముందుకు నడిపిస్తారు. అది చిన్న సలహాలా ఆ క్షణానికి అనిపించవచ్చు. కాని అది జీవితానికి సరిపడా గురోపదేశం కూడా కావచ్చు.

అమెరికాకు చెందిన ప్రఖ్యాత హక్కుల కార్యకర్త, కళాకారిణి మాయా యాంజిలో తనకు జీవితంలో గురోపదేశంలా ఉపయోగపడిన సలహా తన నానమ్మ నుంచే అందిందని చెప్పుకుంది. ‘మా నానమ్మ నాతో ఏమందంటే– అమ్మాయ్‌.. లోకం నిన్ను ఒక దారిలో నిలబెట్టి ముందుకు వెళ్లమంటే... ఆ దారి నీకు ఇష్టం లేకపోతే ఏం చేస్తావ్‌? ఆ దారి చూపే గమ్యం ఇష్టం లేకపోతే ఏం చేస్తావ్‌? అక్కడి నుంచి వెనక్కు తిరిగి వెళ్లడం కూడా ఇష్టం లేకపోతే ఏం చేస్తావ్‌. ఏమీ చేయకు. చప్పున ఆ దారి వొదిలి నీదైన దారిని కనిపెట్టు.. అని చెప్పింది. నేను అలా నా దారిని కనిపెట్టుకున్నాను’ అందామె.టాటా సంస్థల్లో ఒక ముఖ్య అధిపతి, ప్రసిద్ధ పారిశ్రామికవేత్త జంషెడ్‌ జె.ఇరానీకి తన పదిహేడో సంవత్సరం అతి ముఖ్య ఉపదేశం తండ్రి నుంచే అందింది. విదేశాలలో చదువుకోవడానికి వెళుతున్న జంషెడ్‌ ఇరానీతో తండ్రి– ‘అబ్బాయ్‌... ప్రపంచంలో పుట్టే ప్రతి పదిమందిలో తొమ్మిది మంది ఆ పదోవాడికి పని చేసి పెట్టడానికే పుడతారు. కనుక నువ్వు ఆ పదోవాడిగా ఉండటానికే ప్రయత్నించు’ అన్నాడు. అప్పటి వరకూ ఒక లక్ష్యం లేని జంషెడ్‌ ఆ సలహా విని జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు.

అయితే సంపద అంటే ఆర్థిక సంపద మాత్రమే కాదు. ఆత్మిక సంపద కూడా. అలాంటి సంపదను కోల్పోయే సందర్భాలు వచ్చినప్పుడు కొన్ని విలువైన సలహాలు గురోపదేశాలై జీవితాన్ని నడిపిస్తాయి.
నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్‌ తన భర్తను కోల్పోయినప్పుడు ఆమెకు ఇద్దరు కుమార్తెలే ఉండటాన, కుమారుడు లేనప్పుడు భర్త ఆస్తి దక్కని చట్టం నాడు ఉనికిలో ఉండటాన, బంధువులు ఆ చట్టాన్ని ప్రస్తావించి తనకు ఏమీ దక్కని పరిస్థితి తెచ్చి పెట్టబోతున్నారని గ్రహించి వారందరి మీద కోపంతో ఆమె అమెరికా వెళ్లిపోవడానికి నిశ్చయించుకుంది. అప్పుడు గాంధీజీ ఆమెను పిలిచి ‘నీ లోపల అశాంతి పెట్టుకుని ఎంత దూరం వెళ్లినా ప్రశాంతత పొందలేవు. సామరస్యం వల్లే శాంతి వస్తుంది. ఎవరో మనకు హాని చేస్తారని అనుకుంటాం కాని మనకు మనం తప్ప ఎవరూ హాని చేయలేరు. నువ్వు నీ వారితో సయోధ్య చేసుకో’ అని చెప్పారు. ఆ మాట విన్న విజయలక్ష్మి బంధువులకు వీడ్కోలు చెప్పడానికి వెళ్లింది. వాళ్లందరూ ఎంతో రిలీఫ్‌ పొందారు. ఆమెకు కూడా ఆందోళన వదిలిపోయింది. బంధాలు నిలబడ్డాయి.
అంతే కాదు... గుడ్డిగా వెళ్లే దారిలో చిన్న టార్చిలైట్‌లాగా మిత్రుల నుంచి గురోపదేశం అందుతుంది. నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ థియేటర్‌ ఆర్టిస్ట్‌గా ఢిల్లీలో సంవత్సరాల తరబడి పని చేశాడు. ఎన్నేళ్లు పని చేసినా నటుడుగా పేరు, గుర్తింపు తప్ప ఆర్థిక ఉన్నతి లేదు. కాని తోటి నటులంతా అలాగే ఉన్నారు కనుక అలా ఉండటమే జీవతం కాబోలు అని అతను అనుకున్నాడు. కాని ‘బాండిట్‌ క్వీన్‌’ ఆడిషన్స్‌ కోసం ఢిల్లీ వెళ్లిన దర్శకుడు శేఖర్‌ కపూర్‌ మనోజ్‌ బాజ్‌పాయ్‌ని ఒక పాత్రకు ఎంపిక చేసి ‘జబ్బు చేస్తే వైద్యం చేయించుకోలేని, అద్దె ఇల్లు తప్ప సొంత ఇల్లు లేని ఇలాంటి జీవితంలో ఎన్నాళ్లుంటావ్‌. సినిమాల్లో నటించు’ అని హితవు పలికాడు. ఆ సలహా అతణ్ణి ఇవాళ ఎక్కడ నిలబెట్టిందో మనకే తెలుసు.+

తెలుగులో వేటూరి సుందరరామ మూర్తికి కూడా పాత్రికేయ వృత్తి మీద, కవిగా జీవనం సాగించం మీద మాత్రమే ఆసక్తి వుండేది. కాని ఆయన విద్వత్తును గమనించిన ఎన్‌.టి.రామారావు ‘సినిమాలకు పాటలు రాయండి’ సలహా ఇచ్చారు. కాని దానిని వేటూరి పాటించలేదు. రెండు మూడేళ్లు గడిచిపోయాయి. మళ్లీ మద్రాసులో వేటూరి తారసపడ్డారు ఎన్‌.టి.ఆర్‌కు. ఆయన తన సలహాను మర్చిపోలేదు. ఈసారి కోపంగా ‘ఎందుకు మా సలహా వినరు. సినిమాలకు రాయండి’ అని హూంకరించారు. అంతేకాదు అవకాశాలు ఇప్పించారు. వేటూరి సుందరరామమూర్తికి ఆ సలహా గురోపదేశంలా పని చేసింది.
సంగీత దర్శకుడు ఎస్‌.డి.బర్మన్‌ ఒకరోజు నటుడు అశోక్‌ కుమార్‌ ఇంటికి వెళ్లాడు. అశోక్‌ కుమార్‌తో కూచొని మాట్లాడుతూ ఉంటే లోపలి నుంచి సైగల్‌ గొంతుతో పాట వినిపిస్తూ ఉంది. అచ్చు సైగల్‌ గొంతులాగానే. అది విన్న ఎస్‌.డి.బర్మన్‌ ‘లోపల పాడుతున్నది ఎవరు?’ అని అశోక్‌ కుమార్‌ని అడిగాడు. ‘మా తమ్ముడే’ అని అశోక్‌ కుమార్‌ తన తమ్ముడిని పిలిచి ఆయన ముందు నిలబెట్టాడు. అప్పుడు బర్మన్‌ ‘చూడు.. బాగా పాడుతున్నావు. కాని సైగల్‌ లాగా పాడుతున్నావు. అనుకరణలో భవిష్యత్తు లేదు. నవ్వు నీలాగా పాడటం నేర్చుకో పైకొస్తావు’ అన్నాడు. ఆ కుర్రాడు ఆ ఉపదేశం పాటించి భవిష్యత్తులో కిశోర్‌ కుమార్‌ అయ్యాడు.

రేపు సెప్టెంబర్‌ 5 ఉపాధ్యాయదినోత్సవం
ప్రపంచ కోటీశ్వరుడు వారెన్‌ బఫెట్‌ తనకు అందిన అతి గొప్ప గురోపదేశంగా ఒక మిత్రుడు వాక్కు గురించి ప్రస్తావిస్తాడు. బఫెట్‌ అంటాడు– ‘‘ఒక మిత్రుడు నాతో ఒకసారి అన్నాడు – ‘బఫెట్‌ నీకు గనక కోపం వచ్చి ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఆ రోజుకు నోరు మూసుకొని ఉండు. మరునాడు కూడా అలాగే అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకో’ అని. నా జీవితంలో ఆ సలహాను పాటించి లాభం పొందుతూనే ఉన్నాను’’ అంటాడాయన.

ఉర్దూ కవిత్వంలో ‘తరన్నుమ్‌’ అనేది గాన పద్ధతి. కవిత్వాన్ని పాటలాగా పాడి వినిపిస్తారు. ప్రఖ్యాత కవి కైఫీ ఆజ్మీ ఇంకా తాను అంత ప్రఖ్యాతం కాక మునుపు ఒకసారి హైదరాబాద్‌లో సరోజిని నాయుడును కలిశారు. ‘ఏదీ నీ కవిత్వం వినిపించు’ అని ఆమె అడిగారు. కైఫీ తన కవిత్వాన్ని తరన్నుమ్‌ పద్ధతిలో పాడి వినిపించాడు. అది విని సరోజిని నాయుడు ‘కైఫీ... దయచేసి ఇక మీదట ఎవరికీ ఇలా పాడి నీ కవితను వినిపించకు. భావస్పోరకంగా చదువు. చాలు’ అని సలహా ఇచ్చారు. ఆనాటి నుంచి కైఫీ తన కవితను పాడటం మానేశాడు. ఆయన గొంతే ఆ తర్వాతి కాలంలో కవితా ఉనికి అయ్యింది.
పాఠాలు ఇలాంటివే చాలా దొరుకుతూ ఉంటాయి. అవి పాఠాలుగా గ్రహించినప్పుడే మనం ఉత్తమ శిష్యులవుతాము. ఆ తర్వాత గురువులవుతాము. బడి బయట ఎందరో ఉపాధ్యాయులు. వారందరికీ వందనాలు.– సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top