పరీక్షల తరువాత... | Summer holiday | Sakshi
Sakshi News home page

పరీక్షల తరువాత...

Apr 10 2017 12:19 AM | Updated on Sep 5 2017 8:22 AM

పరీక్షల తరువాత...

పరీక్షల తరువాత...

ముందు కష్టాలొచ్చి, తరువాత సుఖాలొస్తాయని నాకు చిన్నప్పుడే తెలుసు. పరీక్షలు రాస్తేనే కదా ఎండాకాలం సెలవలొచ్చేది. పరీక్షలొస్తే ప్రాణం మీది కొచ్చినట్టే.

ముందు కష్టాలొచ్చి, తరువాత సుఖాలొస్తాయని నాకు చిన్నప్పుడే తెలుసు. పరీక్షలు రాస్తేనే కదా ఎండాకాలం సెలవలొచ్చేది. పరీక్షలొస్తే ప్రాణం మీది కొచ్చినట్టే. అదేం కర్మో మనం చదవకుండా వదిలేసిన ప్రశ్నలే పరీక్షల్లో అడుగుతారు. కాపీ కొడదామంటే అదీ కష్టమే. ఏ ప్రశ్నకి ఏది జవాబో తెలియాలి కదా! ఏమి రాసినా పరీక్షలు ఏదో ఒకరోజు అయిపోతాయి. తరువాత సెలవులొస్తాయి.

లాస్ట్‌ పరీక్ష రాసిన రోజు కాళ్ళు భూమ్మీద ఆనవు. ఆరోజు సాయంత్రం సినిమా చూడడం మన జన్మహక్కు. పరీక్షలు రాసిరాసి అలసిపోయి వుంటామని నమ్మడం వల్ల ఇంట్లో కూడా ఉదారంగా డబ్బులిచ్చేవాళ్ళు (అంటే టికెట్‌ కాకుండా ఎగస్ట్రాగా పావలా). పిల్లకాయల టేస్ట్‌కి అనుగుణంగా ఆరోజు థియేటర్‌ వాళ్లు కూడా సినిమాలు మార్చేవాళ్ళు. ఒకదానిలో జ్వాలాదీప రహస్యం, ఇంకోటి ఒకనారి – వంద తుపాకులు. కత్తియుద్ధమా, తుపాకీ కాల్పులా... ఇది డిసైడ్‌ చేసుకోవడానికి కొంచెం టైం పట్టేది. గ్రూప్‌ డిస్కషన్‌ చేసుకుని చివరికి జ్వాలాదీప రహస్యానికి వెళ్ళేవాళ్లం.

 జానపదాల్లో వున్న సౌలభ్యం ఏమంటే మంత్రతంత్రాలుంటాయి. మంత్ర శక్తులపై అప్పటికే అపారమైన నమ్మకం. (సినిమాల్లో ఎప్పుడూ మాంత్రికుడు ఓడిపోతాడని తెలిసినా ఒక దశలో నేను అదే కెరీర్‌గా ఎంచుకున్నాను. ఇప్పటి పిల్లలకి పుట్టినప్పటి నుంచి ఐఐటీ ఫౌండేషన్‌ వేయడం వల్ల వాళ్ళకి యంత్రాలే తప్ప మంత్రాలు తెలియవు.)

ఓ పదిమంది గుంపుగా కలసి థియేటర్‌కి వెళ్ళేవాళ్ళం. దారిలో కుక్కల భయం. అవి మమ్మల్ని చూసి బృందగానం చేస్తూ వెంట పడేవి. వేగంగా పరుగెత్తి థియేటర్‌కి చేరుకునేవాళ్ళం. చెనిక్కాయలు, బఠాణీలు, బర్ఫీలు ఇలా ఎవరి అభిరుచి మేరకు వాళ్ళు జేబులు నింపుకుని కాంతారావు కత్తియుద్ధాన్ని కళ్ళారా చూసి వచ్చేవాళ్ళం. మరుసటిరోజు నుంచి ఏం చేయాలనే ప్రణాళికా రచన కూడా థియేటర్‌లోనే జరిగేది.

కొంతమంది అదృష్టవంతులు వూళ్ళకి వెళ్ళేవాళ్లు. దురదృష్టవంతులు ట్యూషన్లకి వెళ్ళేవాళ్ళు. మిగిలినవాళ్ళం ఈతకి వెళ్ళేవాళ్ళం. నీళ్ళని చూస్తే ఆనందం, మునిగేకొద్దీ సంబరం. బావిలోనుండి బయటకొస్తే భయంకరమైన ఆకలి. పచ్చిమామిడికాయల్ని కూడా పళ్ళు పులిసిపోయేలా తినేవాళ్ళం. ఈతకి వెళ్ళినట్టు ఇంట్లో తెలిస్తే ఈతబెత్తం విరిగేది. ఈత రానివాళ్ళు మాతోపాటు వచ్చి మునిగిపోతారని భయం.

చెప్పులు లేకపోయినా భగభగ మండే ఎండలు మమ్మల్ని ఏం చేసేవి కావు. తెల్లారేసరికి పక్షుల్లాగా వూరిమీద పడితే మళ్ళీ ఎప్పుడో ఇల్లు చేరేది. పుల్లఐస్, తాటిముంజెలు, కర్బూజ, పుచ్చకాయ ముక్కలు చల్లటి చూపుతో పలకరించేవి. ఎక్కడ చూసినా చెట్లు, కన్నతల్లుల్లా ఆదరించేవి.గతం ఎప్పుడూ సంతోషంగానే వుంటుంది. వర్తమానంతోనే సమస్య. చదువుతోపాటు పరీక్షలు ముగుస్తాయని అనుకుంటాం కానీ, అసలైన అగ్నిపరీక్షలు ఆ తరువాతే వస్తాయి. పరీక్షల తరువాత పరీక్షలు. సెలవులు మాత్రం వుండవు.
– జి.ఆర్‌. మహర్షి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement