నేనున్నాను కదా..!

Some childrens children have heard - Sakshi

చెట్టు నీడ

ఒకరోజు రాత్రి గస్తీ తిరుగుతుండగా హజ్రత్‌ ఉమర్‌ (రజి)కు కొంతమంది పిల్లల రోదనలు వినిపించసాగాయి. పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఏడుస్తున్నారనే విషయం హజ్రత్‌ ఉమర్‌ (రజి)కు బోధపడింది. వాళ్లను సముదాయిస్తూ ఆ పిల్లల తల్లి ఒక గిన్నెలో నీళ్లు పోసి పొయ్యిమీద ఏదో వండుతున్నట్లు నటిస్తున్న దృశ్యాలు హజ్రత్‌ ఉమర్‌ (రజి) గమనించారు. ఆ సమయంలో తన సేవకుడు అస్లామ్‌ ఆయన వెంట ఉన్నారు. ఉన్నపళంగా ధనాగారానికి చేరుకున్నారు. పిండి, నెయ్యి, ఖర్జూరాలు తదితర నిత్యావసరాలను ఒక బస్తాలో నింపుకుని ఈ బస్తాను తన నడుముపై పెట్టాలని సేవకుడిని కోరారు. దానికి సేవకుడు అస్లమ్‌ ‘‘ఖలీఫా ఇంత కష్టం తమరికెందుకు? నేనున్నాను కదా’’ అని అన్నాడు.

‘‘ప్రళయం రోజు ఒకరి బరువును మరొకరు మోయరు కదా అస్లామ్‌’’ అంటూనే ఆ మూటను మోసుకుంటూ వెళ్లి ఆ గృహిణికి అందించారు ఖలీఫా. స్వయంగా తన స్వహస్తాలతో పొయ్యి రాజేసి వంటను సిద్ధం చేసి పిల్లలకు తినిపించారు. కడుపునిండా తిన్న పిల్లలు ఆడుతూ పాడుతూ కేరింతలు వేయసాగారు. ఆ పిల్లలు ఆటపాటలను చూసి హజ్రత్‌ ఉమర్‌ సంతోషించారు. దీనికి కృతజ్ఞతగా ఆ గృహిణి ‘‘ఖలీఫా పదవికి నీవే అన్ని రకాలా  అర్హుడివిగా కనపడుతున్నావు. అల్లాహ్‌ నా దీవెన యథార్థం చేయుగాక’’ అంటూ దీవెనలు అందించింది. ఉమర్‌ ఆ మహిళ మాటలు విని మనస్సులోనే నవ్వుకుంటూ అక్కడి నుంచి నిష్క్రమించారు. 
– ఎస్‌.ఎం. బాషా 
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top