శ్లోకం... భావం

శ్లోకం... భావం




 జానక్యాః కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితాః

 న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్ కుంద ప్రసూనాయితాః

 స్రస్తా శ్యామల కాయకాంతి కలితా యా ఇంద్రనీలాయితాః

 ముక్తా తా శుభదా భవంతు భవతామ్ శ్రీరామ వైవాహికాః

 

 ఈ శ్లోకం తెలియని తెలుగువారు అరుదు. పెళ్లిశుభలేఖలలో కొన్ని తరాలుగా పునర్ముద్రణ పొందుతూనే ఉంది ఈ శ్లోకం. ఇది చూడగానే సీతారాముల తలంబ్రాల ఘట్టం మనసులో మెదిలి ఆనందం, ఆహ్లాదం కలుగుతాయి.

 

 తాత్పర్యం: సీతారామకల్యాణంలో తలంబ్రాల ఘట్టం... జనక మహారాజు ముత్యాల తలంబ్రాలు తెప్పించాడు. సీతమ్మ మహదానందంతో రాముడి తలపైన తలంబ్రాలు పోస్తోంది. ఆ తెల్లని ముత్యాల తలంబ్రాలు... ఎర్ర తామరపువ్వులా వెలిగే సీతమ్మ దోసిట్లో ఉన్నప్పుడు పద్మరాగమణుల్లా కనిపించాయి. ఆమె వాటిని శ్రీరాముడి శిరస్సు మీద పోసినప్పుడు, ఆ నల్లని కేశాల మీద అవి తెల్లని మల్లెపూలల్లా ప్రకాశించాయి. తలమీది నుంచి కొంచెం జారి, ఆ నీలమేఘశ్యాముడి శరీరం మీద జాలువారినప్పుడు, ఆయన శరీరకాంతిలో అవి ఇంద్రనీలమణుల్లా భాసించాయి. అలాంటి ముత్యాల తలంబ్రాలు మీకందరకూ శుభం కలుగజేయుగాక! అంటున్నాడు కవి. రామకర్ణామృతమ్‌లో ఈ శ్లోకం కనిపిస్తుంది.                                       -  మల్లాది హనుమంతరావు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top