సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలు ఆయా నియోజకవర్గాలకు చేరుకున్నాయి. వీటిని ఈ నెల ఆరున అధికారులు పోలింగ్ స్టేషన్లకు తరలించనున్నారు.
సాక్షి, కాకినాడ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలు ఆయా నియోజకవర్గాలకు చేరుకున్నాయి. వీటిని ఈ నెల ఆరున అధికారులు పోలింగ్ స్టేషన్లకు తరలించనున్నారు. జిల్లాలో దాదాపు 37 లక్షల మంది ఓటర్లకు 4056 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అత్యధికంగా 248 పోలింగ్ స్టేషన్లు కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాయి. రాజమండ్రి రూరల్లో 227, కాకినాడ రూరల్లో 225 ఉన్నాయి. రాజోలు(ఎస్సీ) నియోజకవర్గంలో అతి తక్కువగా 186 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 1003 అత్యంత సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉండగా, 917 సమస్యాత్మకమైనవిగా ఎన్నికల అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా పోలింగ్ను పర్యవేక్షించనున్నారు. ఎలాంటి సౌకర్యాలు లేని పోలింగ్ స్టేషన్లు ఏజెన్సీలోని రంపచోడవరంలో 77 గుర్తించారు.
ఈవీఎంల సర్దుబాటు ఇలా..
ఈవీఎంల్లో బ్యాలట్ యూనిట్లు జిల్లాకు తొలి విడతలో భెల్(భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్) నుంచి 11,529, రెండో విడతలో 1,350 వెరసి 12,879 యూనిట్లు వచ్చాయి. కంట్రోల్ యూనిట్లు భెల్ నుంచి తొలి విడతలో 9,225, ఈసీఐఎల్ నుంచి 250 వెరసి 9,475 సరఫరా అయ్యాయి. వీటిలో 20 ఈవీఎంలు, 22 కంట్రోల్ యూనిట్లు పాడై ఉన్నాయి. శిక్షణ కోసం 302 చొప్పున బ్యాలట్, కంట్రోల్ యూనిట్లు పక్కన పెట్టారు. మిగిలిన వాటికి గత నెల 17న మొదటి విడత తనిఖీ పూర్తిచేశారు. ర్యాండమ్ చెకప్ ద్వారా ఏప్రిల్ 28న అన్ని నియోజకవర్గాలకు ఆన్లైన్ కేటాయింపులు చేశారు. అనంతరం 11,207 బ్యాలట్ యూనిట్లు, 8,515 కంట్రోల్ యూనిట్లను ఆర్ఓలకు అందించారు.