ఫలించిన ఒంగోలు ఎంపీ వైవీ కృషి | yv subba reddy to attend cattle expo in Brazil | Sakshi
Sakshi News home page

ఫలించిన ఒంగోలు ఎంపీ వైవీ కృషి

Feb 12 2016 9:07 AM | Updated on May 28 2018 1:52 PM

వైవీని ఆహ్వానిస్తున్నబ్రెజిల్ ప్రతినిధి లెవ్రోస్ - Sakshi

వైవీని ఆహ్వానిస్తున్నబ్రెజిల్ ప్రతినిధి లెవ్రోస్

ఒంగోలు జాతి పశుసంపద అభివృద్ధికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేస్తున్న కృషి ఫలించింది.

ఒంగోలు జాతి పశుసంపద పరిరక్షణకు బ్రెజిల్ సంసిద్ధత

ఒంగోలు టూటౌన్: ఒంగోలు జాతి పశుసంపద అభివృద్ధికి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేస్తున్న కృషి ఫలించింది. పశుసంపద వృద్ధికి ఎంతోకాలంగా బ్రెజిల్ అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశానికి ఇచ్చేందుకు ఆ దేశం అంగీకరించింది. అందులో భాగంగా బ్రెజిల్‌లో ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు జరిగే ‘ఎపోజెబ్ ఎక్స్‌పో’కు హాజరవ్వాలంటూ ఎంపీ వైవీకి ఆహ్వానమందింది. ఆహ్వాన పత్రికను బ్రెజిల్ దేశ ప్రతినిధి డాక్టర్ జోస్ ఓటాలియా లెవ్రోస్ గురువారం హైదరాబాద్‌లో ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ఆయన నివాసంలో కలసి అందజేశారు.

ఒంగోలు జాతి పశుసంపద అభివృద్ధికి బ్రెజిల్ శాస్త్రవేత్తలు అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశానికి అందించాలని గతేడాది నవంబర్ 14న ఆ దేశ వ్యవసాయశాఖ మంత్రిని న్యూఢిల్లీలో కలసి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ‘ఎపోజెబ్ ఎక్స్‌పో’కు హాజరవ్వాలని ఎంపీ వైవీకి బ్రెజిల్ ఆహ్వానం పంపింది. పశుసంపద అభివృద్ధికి బ్రెజిల్ వినియోగించే శాస్త్ర సాంకేతిక పరికరాల్ని ఎక్స్‌పోలో ప్రదర్శిస్తారు. ఈ ఎక్స్‌పోలోనే భారత ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకునేందుకు బ్రెజిల్ సిద్ధంగా ఉందని ఎంపీ తెలిపారు. ఎక్స్‌పోకు కేంద్ర వ్యవసాయమంత్రి రాధామోహన్‌సింగ్, రాష్ట్ర వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావును కూడా ఆహ్వానించారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement