బస్సుకిందకు దూసుకెళ్లిన కారు: ముగ్గురు మృతి | three killed in road accident in prakasam district | Sakshi
Sakshi News home page

బస్సుకిందకు దూసుకెళ్లిన కారు: ముగ్గురు మృతి

Jul 30 2016 10:09 AM | Updated on Aug 30 2018 4:07 PM

వేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న కళాశాల బస్సును ఢీకొట్టింది.

మద్దిపాడు: వేగంగా వెళ్తున్న కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న కళాశాల బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెంకట్రాజుపాలెం బస్టాండ్ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి...  కందుకూరుకు చెందిన పువ్వాడ యోహాన్‌బాబు (44) ఒంగోలులోని రామనాయుడు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నాడు.

ఈ క్రమంలో ఈ రోజు ఉదయం తన స్నేహితుడు మురళి (35)తో కలిసి కారులో కందుకూరు నుంచి ఒంగోలు వెళ్తున్నారు. ఆ క్రమంలో కారు వెంకట్రాజుపాలెం వద్దకు రాగానే రోడ్డు పక్కన ఆగి ఉన్న శ్రీ హర్షిణి కళాశాలకు చెందిన బస్సును ఢీకొట్టింది. విద్యార్థులను ఎక్కించుకోవడానికి బస్టాండ్ సమీపంలో ఆగి ఉన్న బస్సును అదుపు తప్పి కారు వెనుక నుంచి ఢీకొట్టింది.

కారు అధిక వేగంగా ఉండటంతో.. బస్సు కిందికి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో యోహాన్‌బాబు, మురళితో పాటు డ్రైవర్ షేక్ బాబు అక్కడికక్కడే మృతిచెందగా.. వెంకట్రావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement