
ఎవరి విద్యుత్ వారికే!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎవరి విద్యుత్ను వారే వాడుకోవాలని.. విభజన వాటాల ప్రకారం తమకు రావాల్సిన
♦ సీఈఏ కమిటీ తుది భేటీలో రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదన
♦ వాటాలు పోగా ఏపీ నుంచి నికర విద్యుత్ ఇప్పిస్తే సరిపోతుంది
♦ రాష్ట్రానికి 53.89% సీజీఎస్ కోటా ఖరారు..అదనంగా 1.6% విద్యుత్
♦ విద్యుత్ వివాదాలపై 10 రోజుల్లో సీఈఏ తుది నివేదిక!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎవరి విద్యుత్ను వారే వాడుకోవాలని.. విభజన వాటాల ప్రకారం తమకు రావాల్సిన నికర విద్యుత్ను ఏపీ నుంచి ఇప్పిస్తే సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విద్యుత్ సంస్థ (సీఈఏ) నేతృత్వంలోని విద్యుత్ వివాదాల పరిష్కార కమిటీకి ప్రతిపాదించింది. ఇరు రాష్ట్రాలు ప్రతి విద్యుత్ ప్లాంట్ నుంచి పరస్పరం విద్యుత్ పంపకాలు జరుపుకోవడానికి బదులు ఈ విధానమే అత్యుత్తమ పరిష్కారమని సూచించింది. తెలంగాణ, ఏపీల మధ్య విద్యుత్ వివాదాల పరిష్కారానికి కేంద్రం ఏడాదిన్నర కిందట నాటిసీఈఏ చైర్మన్ నీరజా మాథుర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడం తెలిసిందే.
ఈ కమిటీ ప్రస్తుత సీఈఏ చైర్మన్ మేజర్ సింగ్ నేతృత్వంలో సోమవారం ఢిల్లీలో ఇరు రాష్ట్రాల అధికారులతో తుది సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ఇంధనశాఖ కార్యద ర్శి అరవింద్ కుమార్, టీ ట్రాన్స్కో జేఎండీ శ్రీనివాసరావుతోపాటు ఏపీ ట్రాన్స్కో ఎండీ కె.విజయానంద్ హాజరై వాదనలు వినిపించారు. ప్రస్తుత విధానంలో పంపకాల వల్ల పరస్పరం టారిఫ్ చెల్లింపుల్లో వివాదాలతోపాటు ట్రాన్స్మిషన్ నష్టాలు ఎదురవుతున్నాయని, అందుకే నికర విద్యుత్ ఆధారంగా పంపకాలు జరపాలని తెలంగాణ ఇంధనశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్.. ప్రతిపాదించారు.
అలాగే నిర్మాణంలో ఉన్న జెన్కో ప్లాంట్ల పీపీఏలకు ఏపీఈఆర్సీ ఆమో దం లేదనే కారణంతో గతంలో కృష్ణపట్నం ప్లాంట్ నుంచి తెలంగాణకు విద్యుత్ వాటా ఇచ్చేందు కు ఏపీ ప్రభుత్వం గతంలో నిరాకరించిందని.. ఈ వాదనతో తాము ఏకీభవిస్తున్నామన్నారు. ఏ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్లాంట్ల నుంచి విద్యుత్ను పూర్తిగా ఆ రాష్ట్ర అవసరాలకే కేటాయించాలని అరవింద్ కుమార్ కోరారు. అం దువల్ల తెలంగాణలో నిర్మాణంలో ఉన్న జైపూర్ (1,200 మెగావాట్లు), భూపాలపల్లి (600 మెగావాట్లు), కేటీపీఎస్ ఏడో దశ (800 మెగావాట్లు) ప్లాంట్ల నుంచి ఏపీకి వాటాలు వర్తించవని నివేదించగా ఇందుకు ఏపీ ట్రాన్స్కో ఎండీ కె.విజయానంద్ అభ్యంత రం తెలిపారు. నిర్మాణంలోని ప్లాంట్ల నుంచి సైతం వాటాల పంపకాల జరగాలని కోరారు. అలాగే పీపీఏల వివాదాన్ని కేంద్ర న్యాయశాఖ పరిశీలనకు పంపాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రానికి అదనంగా 250 మెగావాట్ల విద్యుత్
ఉమ్మడి రాష్ట్ర పీపీఏల నుంచి సీఈఏ తెలంగాణకు అదనంగా 250 మెగావాట్ల విద్యుత్ను తాజాగా కేటాయించింది. ఇందులో కేంద్ర విద్యుత్ కేంద్రాల (సీజీఎస్) నుంచి ప్రస్తుతం తెలంగాణకు 52.29 శాతం వాటా ఉండగా దాన్ని 53.89 శాతానికి (అంటే 1.6 శాతం పెరుగుదల) పెంచింది. దీంతో తెలంగాణకు 75 మెగావాట్ల విద్యుత్ అదనంగా రానుంది. అలాగే అనంతపురంలోని పవన విద్యుత్ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు 175 మెగావాట్లను సీఈఏ కేటాయించింది.
ఏపీ వాటాను 47.88 శాతానికి పెంచాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనను సీఈఏ తిరస్కరించింది. ఏపీ నుంచి రావాల్సిన జల విద్యుత్, సంప్రదాయేతర విద్యుత్ వాటాలను ఏపీ ప్రభుత్వం నిరాకరించిన నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు రావాల్సిన వాటాల బకాయిలను సైతం ఇప్పించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. తెలంగాణ వాటాగా సీలేరు నుంచి 390 మెగావాట్లను తక్షణమే పునరుద్ధరించాలని కోరింది. సంప్రదాయేతర విద్యుత్ వాటాలకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను పరిహారం రూపంలో ఇప్పించేందుకు సీఈఏ కమిటీ సంసిద్ధత వ్యక్తం చేసింది. మరోవైపు తెలంగాణ, ఏపీల మధ్య విద్యుత్ వివాదాల పరిష్కారంపై సీఈఏ నేతృత్వంలోని కమిటీ వారం, పది రోజుల్లో కేంద్రానికి నివేదిక సమర్పించే అవకాశముంది.