Central power company
-
అడ్డగోలుగా విద్యుత్ కొనుగోళ్లు!
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) కేంద్ర, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్లు (ఈఆర్సీలు) విధించిన పరిమితికి మించిన ధరతో విద్యుత్ కొనుగోళ్లు చేసిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) మండిపడింది. 2012–17 మధ్య స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో ఏకంగా రూ.5,820.90 కోట్లు అధిక వ్యయం జరిగిందని తేల్చింది. జల విద్యుత్ కొరత, విద్యుదుత్పత్తి ప్లాంట్ల ప్రారంభంలో జాప్యం, వ్యవసాయ విద్యుత్ డిమాండ్లో పెరుగుదల కారణంగా అధిక ధరతో విద్యుత్ కొనాల్సి వచ్చిందని ఎస్పీడీసీఎల్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. ఎస్పీడీసీఎల్ పనితీరుపై కాగ్ నివేదికలోని ముఖ్యాంశాలివీ.. - కేంద్ర విద్యుత్ సంస్థ మార్గదర్శకాల ప్రకారం.. ఫైవ్స్టార్ రేటింగ్ కలిగిన త్రీఫేజ్, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లతో విద్యుత్ సరఫరా చేయాలి. కానీ టీఎస్ఎస్పీడీసీఎల్ త్రీస్టార్ రేటింగ్ గల ట్రాన్స్ఫార్మర్లను కొనుగోలు చేసి వినియోగిస్తోంది. అధిక నాణ్యత గల ట్రాన్స్ఫార్మర్లను వినియోగిస్తే.. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ ద్వారా 701 నుంచి 20,586 యూనిట్ల వరకు విద్యుత్ పొదుపు జరిగేది. దీంతో 25 ఏళ్లలో రూ.2,220.49 కోట్లు ఆదా అయ్యేవి. - 2012–17 మధ్య వ్యవసాయ విద్యుత్ సరఫరా అనుమతించిన పరిమితులను మించిపోవడంతో సంస్థపై రూ.1,744.56 కోట్ల భారం పడింది. 2012–17 మధ్య విద్యుత్ నష్టాల విలువ రూ.1,306.76 కోట్లు ఉంటుంది. 2016–17 ఏడాదికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికను సకాలంలో ఈఆర్సీకి సమర్పించకుండా.. పాత టారిఫ్ను కొనసాగించడం వల్ల సంస్థకు రూ.323.89 కోట్ల నష్టం జరిగింది. - మౌలిక సదుపాయాల వృద్ధి కోసం 2012–17 మధ్య ఈఆర్సీ ఆమోదించిన వ్యయం రూ.5,843.43 కోట్లు. కానీ సంస్థ రూ.6,632.62 కోట్లు ఖర్చు చేసింది. ఈ అధిక వ్యయాన్ని విద్యుత్ చార్జీల రూపంలో వసూలు చేసుకోవడానికి ఈఆర్సీ అనుమతించకపోవడంతో.. రూ.789.19 కోట్లను భరించాల్సి వచ్చింది. హా ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా కోసం సంస్థ ముందుగానే నిధులు సమీకరించుకోలేదు. దాంతో రూ.585.91 కోట్లను సొంత వనరుల నుంచి ఖర్చు చేసింది. హా 2012–14 మధ్య చేపట్టిన వివిధ పనుల కోసం తీసుకున్న పెట్టుబడి రుణాల వడ్డీలో 3 నుంచి 5 శాతం వరకు రాయితీని జాతీయ విద్యుత్ నిధి (వడ్డీ రాయితీ) పథకం సమకూర్చింది. ఈ పథకం కింద 2013–17 మధ్య రూ.216.91 కోట్లు రాబట్టుకునేందుకు అవకాశమున్నా.. సంస్థ కేవలం 2013–14కి సంబంధించిన రూ.4.01 కోట్ల రాయితీని మాత్రమే రాబట్టుకుంది. - డిస్కంల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ ప్రణాళికకు ఈఆర్సీ నుంచి ఆమోదం పొందలేదు. దీంతో ఆ పథకం కింద రీషెడ్యూల్ చేసిన రుణాలకు సంబంధించిన వడ్డీలను 2015–16లో విద్యుత్ చార్జీల రూపంలో వసూలు చేసేందుకు ఈఆర్సీ అనుమతించలేదు. దీనివల్ల సంస్థ రూ.1400.74 కోట్ల నష్టాన్ని భరించాల్సి వచ్చిందని కాగ్ తెలిపింది. -
ఎవరి విద్యుత్ వారికే!
♦ సీఈఏ కమిటీ తుది భేటీలో రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదన ♦ వాటాలు పోగా ఏపీ నుంచి నికర విద్యుత్ ఇప్పిస్తే సరిపోతుంది ♦ రాష్ట్రానికి 53.89% సీజీఎస్ కోటా ఖరారు..అదనంగా 1.6% విద్యుత్ ♦ విద్యుత్ వివాదాలపై 10 రోజుల్లో సీఈఏ తుది నివేదిక! సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎవరి విద్యుత్ను వారే వాడుకోవాలని.. విభజన వాటాల ప్రకారం తమకు రావాల్సిన నికర విద్యుత్ను ఏపీ నుంచి ఇప్పిస్తే సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విద్యుత్ సంస్థ (సీఈఏ) నేతృత్వంలోని విద్యుత్ వివాదాల పరిష్కార కమిటీకి ప్రతిపాదించింది. ఇరు రాష్ట్రాలు ప్రతి విద్యుత్ ప్లాంట్ నుంచి పరస్పరం విద్యుత్ పంపకాలు జరుపుకోవడానికి బదులు ఈ విధానమే అత్యుత్తమ పరిష్కారమని సూచించింది. తెలంగాణ, ఏపీల మధ్య విద్యుత్ వివాదాల పరిష్కారానికి కేంద్రం ఏడాదిన్నర కిందట నాటిసీఈఏ చైర్మన్ నీరజా మాథుర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ కమిటీ ప్రస్తుత సీఈఏ చైర్మన్ మేజర్ సింగ్ నేతృత్వంలో సోమవారం ఢిల్లీలో ఇరు రాష్ట్రాల అధికారులతో తుది సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ఇంధనశాఖ కార్యద ర్శి అరవింద్ కుమార్, టీ ట్రాన్స్కో జేఎండీ శ్రీనివాసరావుతోపాటు ఏపీ ట్రాన్స్కో ఎండీ కె.విజయానంద్ హాజరై వాదనలు వినిపించారు. ప్రస్తుత విధానంలో పంపకాల వల్ల పరస్పరం టారిఫ్ చెల్లింపుల్లో వివాదాలతోపాటు ట్రాన్స్మిషన్ నష్టాలు ఎదురవుతున్నాయని, అందుకే నికర విద్యుత్ ఆధారంగా పంపకాలు జరపాలని తెలంగాణ ఇంధనశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్.. ప్రతిపాదించారు. అలాగే నిర్మాణంలో ఉన్న జెన్కో ప్లాంట్ల పీపీఏలకు ఏపీఈఆర్సీ ఆమో దం లేదనే కారణంతో గతంలో కృష్ణపట్నం ప్లాంట్ నుంచి తెలంగాణకు విద్యుత్ వాటా ఇచ్చేందు కు ఏపీ ప్రభుత్వం గతంలో నిరాకరించిందని.. ఈ వాదనతో తాము ఏకీభవిస్తున్నామన్నారు. ఏ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్లాంట్ల నుంచి విద్యుత్ను పూర్తిగా ఆ రాష్ట్ర అవసరాలకే కేటాయించాలని అరవింద్ కుమార్ కోరారు. అం దువల్ల తెలంగాణలో నిర్మాణంలో ఉన్న జైపూర్ (1,200 మెగావాట్లు), భూపాలపల్లి (600 మెగావాట్లు), కేటీపీఎస్ ఏడో దశ (800 మెగావాట్లు) ప్లాంట్ల నుంచి ఏపీకి వాటాలు వర్తించవని నివేదించగా ఇందుకు ఏపీ ట్రాన్స్కో ఎండీ కె.విజయానంద్ అభ్యంత రం తెలిపారు. నిర్మాణంలోని ప్లాంట్ల నుంచి సైతం వాటాల పంపకాల జరగాలని కోరారు. అలాగే పీపీఏల వివాదాన్ని కేంద్ర న్యాయశాఖ పరిశీలనకు పంపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి అదనంగా 250 మెగావాట్ల విద్యుత్ ఉమ్మడి రాష్ట్ర పీపీఏల నుంచి సీఈఏ తెలంగాణకు అదనంగా 250 మెగావాట్ల విద్యుత్ను తాజాగా కేటాయించింది. ఇందులో కేంద్ర విద్యుత్ కేంద్రాల (సీజీఎస్) నుంచి ప్రస్తుతం తెలంగాణకు 52.29 శాతం వాటా ఉండగా దాన్ని 53.89 శాతానికి (అంటే 1.6 శాతం పెరుగుదల) పెంచింది. దీంతో తెలంగాణకు 75 మెగావాట్ల విద్యుత్ అదనంగా రానుంది. అలాగే అనంతపురంలోని పవన విద్యుత్ ప్రాజెక్టు నుంచి తెలంగాణకు 175 మెగావాట్లను సీఈఏ కేటాయించింది. ఏపీ వాటాను 47.88 శాతానికి పెంచాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనను సీఈఏ తిరస్కరించింది. ఏపీ నుంచి రావాల్సిన జల విద్యుత్, సంప్రదాయేతర విద్యుత్ వాటాలను ఏపీ ప్రభుత్వం నిరాకరించిన నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు రావాల్సిన వాటాల బకాయిలను సైతం ఇప్పించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. తెలంగాణ వాటాగా సీలేరు నుంచి 390 మెగావాట్లను తక్షణమే పునరుద్ధరించాలని కోరింది. సంప్రదాయేతర విద్యుత్ వాటాలకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను పరిహారం రూపంలో ఇప్పించేందుకు సీఈఏ కమిటీ సంసిద్ధత వ్యక్తం చేసింది. మరోవైపు తెలంగాణ, ఏపీల మధ్య విద్యుత్ వివాదాల పరిష్కారంపై సీఈఏ నేతృత్వంలోని కమిటీ వారం, పది రోజుల్లో కేంద్రానికి నివేదిక సమర్పించే అవకాశముంది.