మూడు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థి నాగార్జునరెడ్డి ఆస్పత్రిలో కన్నుమూశాడు.
హుజూర్నగర్(నల్లగొండ): మూడు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థి నాగార్జునరెడ్డి ఆస్పత్రిలో కన్నుమూశాడు. వివరాలివీ... నల్లగొండ జిల్లా హుజూర్నగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నాగార్జునరెడ్డి దొంగతనం నేరం మోపారని మనస్తాపం చెంది ఈనెల 18వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తోటి విద్యార్థుల వేధింపులను తట్టుకోలేక తాను పురుగు మందుతాగి చనిపోతానంటూ సూసైడ్నోట్ పెట్టాడు. శనివారం కృష్ణా జిల్లా చిల్లకల్లు సమీపంలో తీవ్రంగా కాలినగాయాలతో ఉండగా స్థానికులు జగ్గయ్యపేట ఆస్పత్రిలో చేర్చారు.
పరిస్థితి విషమంగా మారటంతో కుటుంబసభ్యులు విజయవాడలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, తనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారని న్యాయమూర్తికి అతడు వాగ్మూలం ఇవ్వటం గమనార్హం. కాగా, అప్పటి నుంచి చికిత్స పొందుతున్న నాగార్జున రెడ్డి సోమవారం ఉదయం కన్నుమూశాడు. పాఠశాల యాజమాన్యమే తమ కుమారుడి మరణానికి కారణమంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.