
బ్యాంకుల్లో ‘సంక్రాంతి’ రద్దీ
సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం సాయినగర్ ఎస్బీఐ ప్రధానశాఖ, ఇతర బ్యాంకు శాఖలు ఖాతాదారులతో కిటకిటలాడాయి.
అనంతపురం అగ్రికల్చర్ : సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం సాయినగర్ ఎస్బీఐ ప్రధానశాఖ, ఇతర బ్యాంకు శాఖలు ఖాతాదారులతో కిటకిటలాడాయి. ఏటీఎంల వద్ద కూడా జనం ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. శుక్రవారం బ్యాంకులు పనిచేస్తుండగా శని, ఆదివారాలు సెలవు కావడంతో గురువారం బ్యాంకుల్లో జనం ఎక్కువగా కనిపించారు. నగదు కోసం గంట, రెండు గంటల పాటు పడిగాపులు తప్పలేదు.
నగదు అందుబాటులో ఉన్నందున ఎలాంటి ఇబ్బంది లేకుండా గరిష్ట మొత్తంలో విత్డ్రా ఇస్తున్నట్లు ఎస్బీఐ ఆర్ఎం ఎంవీఆర్ మురళీకృష్ణ తెలిపారు. సోమవారానికి మరికొంత నగదు రానుందని, అన్ని వర్గాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని ఎల్డీఎం జయశంకర్ తెలిపారు. 850 వరకు స్వైప్ మిషన్లు పంపిణీ చేశామని, ఇంకా 900 వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు. 350 ఏటీఎంల వరకు పనిచేసినట్లు ఎల్డీఎం చెప్పారు.