అన్యాయం | no funds for District Development in budget | Sakshi
Sakshi News home page

అన్యాయం

Mar 11 2016 9:57 PM | Updated on Apr 7 2019 3:35 PM

అన్యాయం - Sakshi

అన్యాయం

రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. అరకొర కేటాయింపులతో ప్రభుత్వం జిల్లాపై వివక్ష చూపింది.

బడ్జెట్‌లో జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించని ప్రభుత్వం
జిల్లాకు ప్రాణప్రదమైన జీఎన్‌ఎస్‌ఎస్‌కు అరకొర కేటాయింపు
దుస్థితిలో కేసీ కెనాల్...మైలవరం ప్రాజెక్టులు
ట్రిపుల్ ఐటీ, యోగివేమన యూనివర్సిటీ పట్ల నిర్లక్ష్యం
మహిళలు, రైతులకు సైతం లభించని చేయూత

సాక్షి ప్రతినిధి, కడప:  రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. అరకొర కేటాయింపులతో ప్రభుత్వం జిల్లాపై వివక్ష చూపింది. జలయజ్ఞం ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో పూర్తి అశ్రద్ధ వహించింది. జిల్లాకు ప్రాణప్రదమైన గాలేరు-నగరి సుజల స్రవంతి పథకం సైతం పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. అభివృద్ధి ఫలాలందించే పథకాలకు సైతం నిధుల కేటాయింపులు లేవు. ట్రిపుల్ ఐటీ, యోగివేమన యూనివర్సిటీ, రిమ్స్ వంటి అత్యున్నత  విద్యాసంస్థల పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శించలేకపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పట్ల ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని తేటతెల్లమైంది.

 ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు భారీ కోత పెట్టారు. పథకాలు పూర్తి దశకు చేరిన తరుణంలో నిధులు కేటాయిస్తే అభివృద్ధి ఫలాలు అందుతాయన్న ఇంగితజ్ఞానం ప్రభుత్వ పెద్దలకు లోపించిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

 ప్రభుత్వానికి లోపించిన చిత్తశుద్ధి..
మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించాలనే సంకల్పం టీడీపీ ప్రభుత్వంలో కన్పించడం లేదు. కృష్ణా జలాలు రాయలసీమకు అందించి తద్వారా కరువును పారదోలాలనే సంకల్పంతో జలయజ్ఞం పనులు పుట్టుకొచ్చాయి. పాలకపక్షం శీతకన్ను కారణంగా పెండింగ్ పథకాల జాబితాలోకి జిల్లా సాగునీటి పథకాలు చేరిపోయాయి. జీఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ పథకాలు పూర్తి అయితే వెనుకబడ్డ రాయలసీమకు సాగునీటి వసతి కల్పించే అవకాశం ఉంది. ఈ పథకాల పట్ల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఉన్న చిత్తశుద్ధి తర్వాత అధికారంలో ఉన్న పాలకులకు లేకపోవడంతోనే పెండింగ్ పథకాలుగా దర్శనమిస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన జీఎన్‌ఎస్‌ఎస్‌కు కేవలం రూ.348 కోట్లతో సరిపెట్టింది. అలాగే పీబీసీకి రూ.84కోట్లు, తెలుగుగంగ ప్రాజెక్టు రూ.70.6 కోట్లు కేటాయించింది. కేసీ కెనాల్ ఆధునికీకరణ పట్ల పాలక పక్షానికి చిత్తశుద్ధి లోపించింది. అదే కోవలో మైలవరం ప్రాజెక్టు సైతం చేరిపోయింది. వెలిగల్లు, చెయ్యేరు, దిగువ సగిలేరు, ఎగువ సగిలేరు, బుగ్గవంక లాంటి  ప్రాజెక్టులకు కేటాయింపుల్లో చోటు దక్కకపోవడం గమనార్హం.

 ఉన్నత విద్యపట్ల సైతం అదే ధోరణి..
జిల్లాలోని అత్యున్నత విద్యా సంస్థల పట్ల సైతం ప్రభుత్వం నిర్లక్ష్యమే ప్రదర్శించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. యోగివేమన యూనివర్సిటీకి టీడీపీ ప్రభుత్వం అరకొర ఆర్థిక కేటాయింపులే చేపట్టింది. వైవీయూ సిబ్బంది జీతభత్యాలకు సరిపడ మేరకే బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది.  అలాగే ట్రిపుల్ ఐటీ, రిమ్స్‌కు ఈమారు సరైన ప్రాధాన్యత ఇవ్వలేకపోయింది. ఐజీ కార్ల్ పశు పరిశోధన సంస్థ ఊసే లేదు.  (రూ.కోట్లలో) కేటాయింపులున్నాయి.

 ఫిరాయింపులు సరే... అభివృద్ధి ఏదీ..?
ఇది వరకే 11 అంతర్జాతీయ సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే కడప మినహా అన్నీ ప్రాంతాలకు ప్రాధాన్యత దక్కింది. ఉర్దూ యూనివర్శిటీ నెలకొల్పుతామని చెప్పి, హజ్‌హౌస్‌కు పరిమితం చేసింది. జిల్లాకు చెందిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించిన ప్రభుత్వం అదే శ్రద్ధ అభివృద్ధి విషయంలో  చూపలేదనే విమర్శలు వినవస్తున్నాయి.

అంకెల గారడీ
రాష్ట్ర బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉంది. అంకెల గారడీతో మాయ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఏ వర్గానికి  కూడా సరిపడినన్ని నిధులు కేటాయించలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగింది. విభజన హామీలుగానీ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలుగానీ నెరవేర్చే దిశగా కేటాయింపులు జరపలేదు. జిల్లాకు ప్రభుత్వం ప్రకటించిన ఒక్క హామీని కూడా ఈ బడ్జెట్ నెరవేర్చలేదు.
     - ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement