మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు కన్నుమూత
ఖమ్మం : ఖమ్మం జిల్లా కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. ఈ రోజు తెల్లవారుజామున కొత్తగూడెంలోని ఆయన నివాసంలో నాగేశ్వరరావుకు తీవ్ర గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో....నాగేశ్వరరావు మృతి చెందారు.
కొత్తగూడెం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చంద్రబాబు కేబినెట్ లో కోనేరు నాగేశ్వరరావు మంత్రిగా పని చేశారు. కోనేరు మృతి పట్ల తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి తుమ్మల ప్రగాఢ సంతాపం తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోనేరు నాగేశ్వరరావు మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కోనేరు కుటుంబ సభ్యులకు చంద్రబాబు సంతాపం తెలియజేశారు.