ఆరోగ్యంపై అప్రమత్తం


- అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్‌

- జిల్లాలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంలు

కాకినాడ సిటీ: జిల్లాలో ఆరోగ్య పరిస్ధితుల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వై.రామవరం మండలం చాపరాయి గ్రామంలో గిరిజనులు విష జ్వరాల బారిన పడి 16 మంది మృతి చెందడమే కాకుండా అనేక మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా ఏజన్సీ ప్రాంతంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో జ్వరాలు, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తతపై కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా సంబంధిత శాఖల అధికారులకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్‌తో పాటు జిల్లాలో డివిజన్‌ స్ధాయిలో అన్ని ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలని సూచించారు. రెవెన్యూ, వైద్యారోగ్య శాఖ, పంచాయితీ, డీఆర్‌డీఏ, ఆర్‌డబ్ల్యూఎస్, పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో వ్యవహరించి పారిశుధ్యం, తాగునీరు, వైద్యసేవల పరంగా ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు తీసుకోవాలని,  క్షేత్ర స్ధాయి పరిస్ధితులపై ప్రతిరోజు నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని ఏడు డివిజన్లలో ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశారు. డివిజన్ల పరిదిలోని క్షేత్రస్ధాయిలో ఉన్న పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలపై ప్రజలు కూడా సంబంధిత ఆర్డీవో కార్యాలయాల కంట్రోల్‌ రూం నెంబర్లకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

  కలెక్టరేట్‌ తోపాటు జిల్లాలోని ఏడు డివిజన్ల ఆర్డీవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం నెంబర్లు.

 కలెక్టరేట్‌ : టోల్‌ఫ్రీ నెంబర్‌ 1800 425 307

 కాకినాడ డివిజన్‌: 0884– 2368100

 అమలాపురం : 08856–233100

 రాజమహేంద్రవరం: 088– 2442344

 పెద్దాపురం : 088– 241256

 రామచంద్రాపురం: 088– 245166

 రంపచోడవరం: 08864–243561

 ఎటపాక : 7013697657
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top