ఎస్‌ఎంసీల ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌ | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎంసీల ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌

Published Sun, Jul 24 2016 10:58 PM

ఎస్‌ఎంసీల ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌

26న స్కూళ్ల వారీగా నోటిఫికేషన్‌
ఆగస్టు 1న ఎన్నికలు..అదేరోజు ప్రమాణ స్వీకారం

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించాల్సిన స్కూల్‌ మెనేజ్‌మెంట్‌ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలకు ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి షెడ్యూలు విడుదల చేసింది. మార్చిలో ఒకసారి షెడ్యూలు విడుదల చేసిన ప్రభుత్వం తీరా ఎన్నికలకు రెండు రోజులు ముందు వాయిదా వేసింది. తాజాగా ఈనెల 26న నిర్వహిస్తున్నట్లు ప్రకటించి ఒకరోజు ముందు వాయిదా వేశారు. మరోసారి ఆగస్టు 1న ఎస్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించేలా నిర్ణయించింది. ఈ మేరకు  ఆదివారం షెడ్యూలు విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 3,882 పాఠశాలల్లో ఎస్‌ఎంసీలను నియమించనున్నారు.

ఎన్నికల షెడ్యూలు ఇలా..
ఈనెల 26నlఉదయం 10 గంటలకు ఆయా స్కూళ్ల వారీగా హెచ్‌ఎంలు నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఓటర్ల జాబితా తయారు చేసి నోటీస్‌ బోర్డులో ఉంచుతారు. ఓటరు జాబితాలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఇద్దరూ ఉంటారు. అయితే ఓటింగ్‌కు మాత్రం ఇద్దరిలో ఒకరిని మాత్రమే అనుమతిస్తారు.

•  29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు  ఓటర్ల జాబితాల్లో ఏవైనా అభ్యంతరాలుంటే స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి అదేరోజు  సాయంత్రం 4 గంటలకు తుది జాబితా విడుదల చేస్తారు.

•  ఆగస్టు 1న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య ఎన్నికలు నిర్వహిస్తారు. 1.30 గంటలకు ఎన్నికైన సభ్యులు మినహా తక్కిన వారందరినీ బయటకు పంపుతారు. 2 నుంచి 3 గంటల వరకు ఎన్నికైన సభ్యులతో చైర్మన్, వైస్‌ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. అనంతరం చైర్మన్, వైస్‌ చైర్మన్‌లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 3.30 గంటలకు మొదటి ఎస్‌ఎంసీ సమావేశం నిర్వహిస్తారు.
 

Advertisement
Advertisement