
24వ తేదీ వరకు గ్రామోదయ్ సే..
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 24వ తేదీ వరకు ‘గ్రామోదయ్సే..
♦ అంబేడ్కర్ ఆశయాలపై గ్రామీణులకు అవగాహన
♦ ప్రతి పల్లెలో ప్రభాత భేరీలు.. పథకాలపై చైతన్యం
♦ 24న పీఎం సభకు జిల్లా నుంచి నలుగురు సర్పంచ్లు
♦ ‘సాక్షి’తో జిల్లా పంచాయతీ అధికారి అరుణ
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని 24వ తేదీవరకు ‘గ్రామోదయ్ సే.. భారత్ ఉదయ్ అభియాన్’ను చేపట్టినట్లు జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ జే.అరుణ తెలిపారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 24వ తేదీ వరకు ‘గ్రామోదయ్సే.. భారత్ ఉదయ్ అభియాన్’ను నిర్వహించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ జే.అరుణ తెలిపారు. అంబేడ్కర్ సంస్మరణ సభలు, పంచాయతీరాజ్ వ్యవస్థ విశిష్టత, పల్లెల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలపై ఈ పది రోజుల్లో అవగాహన సదస్సులు, ఉత్సవాలు, ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు.
గురువారం ఆమె ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో 16వ తేదీవరకు గ్రామసభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. సాంఘిక దురాచారాలు, అంటరానితనం నిర్మూలన, కుల, మత సామరస్యంపై అంబేడ్కర్ ఆశయాలను గ్రామీణులకు వివరించనున్నట్లు కల్పించనున్నట్లు తెలిపారు. 17 నుంచి 20వ తేదీవరకు రైతు సదస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన, సాయిల్ హెల్త్కార్డు తదితర అంశాలపై రైతులను చైతన్యం చేయనున్నట్లు స్పష్టంచేశారు.
21 నుంచి 24వ తేదీవరకు గ్రామాల్లో ‘ప్రభాతభేరీ’ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. దీనిలో భాగంగా సర్పంచ్ అధ్యక్షతన ప్రతి గ్రామంలో ర్యాలీలు తీస్తామని తెలిపారు. ఈ నాలుగు రోజుల్లో పారిశుద్ధ్య నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడాపోటీల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తామన్నారు.
ఆఖరి రోజు (24న) పంచాయతీరాజ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జంషెడ్పూర్లో జరిగే సభ ద్వారా సందేశం వినిపిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి నలుగురు సర్పంచ్లు (చీమలదరి, శామీర్పేట, మణికొండ, కీసర ) హాజరుకానున్నట్లు అరుణ వివరించారు.
కేంద్రం నుంచి పరిశీలకుడు...
గ్రామోదయ్సే భారత్ ఉదయ్ అభియాన్ కార్యక్రమం అమలుతీరును పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం.. జిల్లాకు ప్రత్యేక పరిశీలకుడిని పంపింది. తమిళనాడుకు చెందిన చిన్నదురై 24వ తేదీవర కు ఇక్కడ పర్యటించి అంబేడ్కర్ 125 జయంతి ఉత్సవాల నిర్వహణ సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోనున్నారు.