అనుమానంతో పెళ్లి అయిన రెండేళ్లకే భార్యను కడతేర్చాడు ఓ భర్త.
ప్రాణం తీసిన అనుమానం
Nov 17 2016 12:24 AM | Updated on Jul 27 2018 2:21 PM
- భార్యకు నిప్పటించిన భర్త
-అంకిరెడ్డిపల్లెలో ఘటన
కొలిమిగుండ్ల: అనుమానంతో పెళ్లి అయిన రెండేళ్లకే భార్యను కడతేర్చాడు ఓ భర్త. ఈ ఘటన బుధవారం అంకిరెడ్డిపల్లె ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన శివనారాయణకు బనగానపల్లె మండలం యాగంటిపల్లెకు చెందిన భవాని(22)తో రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇంకా సంతానం కలగలేదు. అయితే, గత కొద్ది రోజుల నుంచి భార్యపై అనుమానం పెంచుకున్నాడు శివనారాయణ. దీంతో ఇరువురి మధ్య తరచు ఘర్షణ జరుగుతుండేది. ఈక్రమంలో బుధవారం ఉదయం మరో సారి భార్యతో గొడవ పడి ఆమె ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు. ఇంటి ఆవరణలోనే జరిగిన ఈ ఘటనతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం భర్త తాడిపత్రి ప్రభుత్వ వైద్యశాలకు తరలించాడు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. అయితే, కొద్దిసేపటికే ఆమె కోలుకోలేక మృతిచెందింది. మృతురాలి తల్లి బాలతిమ్మమ్మ ఫిర్యాదు మేరకు ఎస్ఐ బీటీ వెంకటసుబ్బయ్య శివనారాయణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement


