మద్యం వ్యాపారులు సమయపాలన పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు తెలిపారు.
సమయపాలన పాటించకపోతే కేసులు
Jan 29 2017 12:25 AM | Updated on Jul 11 2019 8:43 PM
– ఎక్సైజ్ డిప్యుటీ కమిషనర్ శ్రీరాములు
కర్నూలు: మద్యం వ్యాపారులు సమయపాలన పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు తెలిపారు. వేళాపాళా లేకుండా దుకాణాల్లో మద్యం విక్రయాలు కొనసాగిస్తున్న విషయాన్ని ‘సాక్షి’లో ‘మామూళ్ల మత్తు’ శీర్షికన ఈనెల 28న కథనం వెలువడింది. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు ఈ కథనంపై స్పందించారు. ఏప్రిల్ నుంచి డిసెంబర్ మాసం వరకు జిల్లా వ్యాప్తంగా సమయపాలన పాటించని మద్యం వ్యాపారులపై 70 కేసులు నమోదు చేశామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా మద్యం షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు, బార్లలో ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయాలు జరపాలన్నారు.
అంతకుమించి దుకాణాలు తెరిచి ఉంచితే నిఘా వేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ధరల ఉల్లంఘనకు సంబంధించి 35 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. అలాగే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కేసులు 77 నమోదు చేశామని.. 89 మందిని అరెస్టు చేసి 402 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే 171 బెల్టు షాపులను గుర్తించి 186 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 566 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘నవోదయం’ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా శనివారం అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా కర్నూలు ఎక్సైజ్ సీఐ పద్మావతి బంగారుపేటలో అవగాహన సదస్సు నిర్వహించారు.
Advertisement
Advertisement