లైన్‌మన్‌పై దాడి , బైక్‌ను ధ్వంసం | Attack on Line Man | Sakshi
Sakshi News home page

లైన్‌మన్‌పై దాడి , బైక్‌ను ధ్వంసం

Mar 1 2017 11:36 PM | Updated on Sep 5 2017 4:56 AM

లైన్‌మన్‌పై దాడి , బైక్‌ను ధ్వంసం

లైన్‌మన్‌పై దాడి , బైక్‌ను ధ్వంసం

ఇంటి విద్యుత్‌ బకాయి కట్టలేదని సర్వీస్‌ కనెక్షన్‌ తొలగించేందుకు వచ్చిన సంబంధిత శాఖ లైన్‌మన్‌పై ఓ మహిళ దాడికి పాల్పడింది.

విద్యుత్‌ బకాయి చెల్లించాలని అడిగిందుకు మహిళ వీరంగం  

కావలి : ఇంటి విద్యుత్‌ బకాయి కట్టలేదని సర్వీస్‌ కనెక్షన్‌ తొలగించేందుకు వచ్చిన సంబంధిత శాఖ లైన్‌మన్‌పై ఓ మహిళ దాడికి పాల్పడింది. అతని ద్విచక్రవాహనాన్ని సైతం ధ్వంసం చేసి వీరంగం సృష్టించింది. ఈ సంఘటన పట్టణంలోని వెంగళరావునగర్‌లో మంగళవారం జరిగింది. స్థానికులు, లైన్‌మన్‌ యు.రాజశేఖర్‌ కథనం మేరకు... వెంగళరావు నగర్‌ బైరాగుల కాలనీ ఐస్‌ ఫ్యాక్టరీ సమీపంలో షేక్‌ హసీనా అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె గత ఏడాది జూలై నుంచి సర్వీస్‌ కనెక్షన్‌కు సంబంధించి విద్యుత్‌ బిల్లు బకాయి ఉంది. గత నెలలో సంబంధిత సిబ్బంది వచ్చి ఫ్యూజ్‌ లింక్‌లు తీసుకెళ్లారు.

అయితే ఆమె మరో ఫ్యూజ్‌లు తెచ్చి విద్యుత్‌ను వినియోగించుకుంటుంది. ఈ నేపథ్యంలో మంగళవారం లైన్‌మన్‌ ఆమె ఇంటికి వెళ్లి విద్యుత్‌ బకాయిలు చెల్లించాలని అడిగారు. ఆమె దురుసుగా సమాధానం చెప్పడంతో స్తంభం ఇంటికి ఉన్న విద్యుత్‌ సర్వీస్‌ కనెక్షన్‌ను తొలింగించే ప్రయత్నంలో చేశాడు. దీంతో ఆమె నిచ్చెన లాగేయడంతో లైన్‌మన్‌ కింద పడిపోయాడు. ఆమె ఇనుప రాడ్డుతో లైన్‌మన్‌పై దాడికి పాల్పడింది. అతని ద్విచక్ర వాహనాన్ని పడేసి అదే రాడ్‌తో ధ్వంసం చేసింది. ఈ ఘటనతో బిత్తరపోయిన లైన్‌మన్‌ తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే ట్రాన్స్‌కో ఇంజినీరింగ్‌ అధికారులు, లైన్‌మన్‌తో కలసి టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదును అందజేశారు. విద్యుత్‌ బకాయిలు కోసం  వినియోగదారుల ఇళ్లకు వెళితే తమపై ఇలా దాడులు చేయడం ఏమిటని విద్యుత్‌ శాఖ అధికారులు, లైన్‌మన్లు ఖండించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement