ఏపీఈఆర్సీకి 2026–27 ప్రణాళికలు సమర్పించిన ట్రాన్స్కో, డిస్కంలు
వైఎస్సార్సీపీ హయాంలో రూపొందించిన ప్రణాళికలే బాబు సర్కారుకు దిక్కు
ఆ ప్రకారమే 2026–27 నుంచి 2028–29 వరకు ప్రణాళికలకు ఆమోదం తెలపాలని విజ్ఞాపన
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లతోపాటు ఏపీ ట్రాన్స్కో 2026–27 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ ప్రణాళికలను విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి సమర్పించాయి. 2024–25 నుంచి 2028–29 వరకూ (5వ నియంత్రణ కాలం), 2029 –30 నుంచి 2033–34 (6వ నియంత్రణ కాలం) ఆర్థిక సంవత్సరానికి కూడా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అంచనాలు తయారుచేసి ఏపీఈఆర్సీకి సమర్పించారు. 5వ నియంత్రణ కాలానికి వైఎస్సార్సీపీ హయాంలోనే ఏపీఈఆర్సీ నుంచి అనుమతి లభించింది.


ఇప్పుడు కూడా దాని ప్రకారమే 2026–27 నుంచి 2028–29 వరకు విద్యుత్ ప్రణాళికకు ఆమోదం తెలపాల్సిందిగా ఏపీఈఆర్సీని విద్యుత్ సంస్థలు కోరాయి. వైఎస్సార్సీపీ హయాంలో రూపొందించిన ప్రణాళికలనే సమర్పించిన విద్యుత్ సంస్థలు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలాంటి మార్పులు, కొత్తగా అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు లేకుండానే సమర్పించడం గమనార్హం. వీటిపై కొత్తగా అభిప్రాయాలు, అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 18వ తేదీతో గడువు ముగుస్తోంది. అనంతరం ఈనెల 25లోగా విద్యుత్ సంస్థలు.. ప్రజలు/సంస్థల నుంచి వచి్చన అభ్యంతరాలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.


