
2019 నాటికి రైతులకు 24 గంటల విద్యుత్: కేసీఆర్
2019 నాటికి రైతులకు 24 గంటల విద్యుత్ అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో కరెంట్ పోయే సమస్యే లేదని అన్నారు.
ఖమ్మం: 2019 నాటికి రైతులకు 24 గంటల విద్యుత్ అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో కరెంట్ పోయే సమస్యే లేదని అన్నారు. బుధవారం ఖమ్మంలో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో సమావేశంలో ఆయన మాట్లాడారు. నవ్వుల తెలంగాణ చూడాలన్నదే తన లక్ష్యంగా పేర్కొన్నారు. ఎంతో కష్టపడి రాష్ట్రాన్ని సాధించామన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందంటూ వాపోయారు. ఉద్యమ నేతలు చాలామంది అమ్ముడు పోయారని విమర్శించారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకే ప్రాజెక్ట్ల రీడిజైన్ చేస్తున్నట్టు తెలిపారు. మిషన్ భగీరథలో ఇంటింటికి నీళ్లు ఇస్తామని చెప్పారు.
ఇంటింటికి నీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని అన్నారు. తెలంగాణ అస్థిత్వం కాపాడేందుకే సీఎం పదవి తీసుకున్నానని చెప్పారు. 2017 డిసెంబర్ నాటికి 95 శాతం పనులు పూర్తి చేస్తామన్నారు. డబుల్ బెడ్ రూం పథకం ఘనత తమేదనన్నారు. ఆర్టీసీ కార్మికులకు భరోసా కల్పించామని చెప్పారు. సంక్షేమంలో దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్నామని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మారుస్తానని, ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు నిద్రపోను' అంటూ కేసీఆర్ స్పష్టం చేశారు.