
మల్లీశ్వరి(ఫైల్ )
గుంటూరు, కాకుమాను: పెళ్లి చేసుకుని తల్లిదండ్రుల్ని వదిలి వెళ్లలేక మనస్తాపంతో కానిస్టేబుల్ మల్లీశ్వరి ఆత్మహత్యతో కాకుమానులో విషాదం చోటు చేసుకుంది. వారం రోజుల్లో పెళ్లి ఉందనగా.. హఠాత్తుగా కూతురు మరణించడంతో ఎనుముల శంకరరావు, కోటేశ్వరమ్మ దంపతులు తట్టుకోలేక పోతున్నారు. శంకరరావు గ్రామంలో కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తూనే ఇద్దరు కుమార్తెలకు వివాహాలు చేశాడు. మూడో కుమార్తె మల్లీశ్వరి 2013లో పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికై చిలకలూరిపేట రూరల్ పోలీస్స్టేషన్లో పని చేస్తోంది.కుమారుడు బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం తండ్రి వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఇటీవల మల్లీశ్వరికి ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన వ్యక్తితో వివాహాన్ని పెద్దలు నిశ్చయించారు.
అప్పటి నుంచి ఆమె ప్రతిరోజు మనోవేదనకు గురవుతోంది. తను వివాహం చేసుకొని వెళ్లిపోతే వృద్ధులైన తల్లిదండ్రులు ఏమైపోతారో ...ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్న తన తమ్ముని పరిస్థితి ఎలా ఉంటుందోదని ఆమె తీవ్ర మనస్తాపం చెందుతోంది. ఒక వేళ వివాహం చేసుకున్న వ్యక్తి తాను ఎంతో ఆశతో, లక్ష్యంతో సాధించుకున్న పోలీస్ ఉద్యోగం వదిలేయమంటాడో అనే ఆలోచనలతో ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం ఎలుకల మందు తిని అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో గమనించిన కుటుంబ సభ్యులు గుంటూరు ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్య సేవల కోసం శుక్రవారం విజయవాడ తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. మరో వారం రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన కూతురు విగతిజీవిగా మారి పాడె ఎక్కడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు చూపరుల్ని కంట తడి పెట్టించింది.
కలెక్టర్ చేతుల మీదుగా సబల అవార్డు
రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఇటీవల చేపట్టిన సబల కార్యక్రమంలో మల్లీశ్వరి చురుగ్గా పాల్గొంది. జిల్లా కలెక్టర్, ఎస్పీల నుంచి జిల్లాలో తొలి సబల అవార్డును అందుకుంది. పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు మల్లీశ్వరి భౌతికకాయానికి పోలీస్ లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్ఐ డి.మార్కండేయలు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి ఘనంగా నివాళులు అర్పించారు.
పలువురు పోలీసులు అధికారుల నివాళులు
నర్సరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వరరావు, తెనాలి డీఎస్పీ స్నేహిత, సీఐ సుభాషిణి, జిల్లా పోలీస్ యూనియన్ నాయకులు చందు పూర్ణచంద్రరావు, బుట్టా ప్రసాద్, పొన్నూరు, నర్సరావుపేట సీఐలు తిరుమలరావు, శోభన్బాబు, ఎస్ఐలు అంజయ్య, రామాంజనేయులు, ఉదయ్బాబులు మల్లీశ్వరి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.