
బాధిత మహిళలు (ఫైల్ ఫొటో)
రాంచీ : జార్ఖండ్లో దారుణం చోటుచేసుకుంది. చేతబడి చేస్తున్నారనే నెపంతో ఓ తల్లీ, కూతురితో బలవంతంగా మానవ మలాన్ని తినిపించారు. గత బుధవారం ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్లితే.. సోనాహుత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో నివసించే ఒక కుటుంబంలోని మహిళ తీవ్ర అనారోగ్యంతో మరణించింది. కొద్దిరోజులకు అదే కుటుంబానికి చెందిన మరో ఇద్దరు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఎవరైనా చేతబడి చేశారన్న అనుమానంతో ఆ కుటుంబ సభ్యులు ఓ భూత వైద్యుడిని సంప్రదించారు. ఆ కుటుంబానికే చెందిన ఇద్దరు మహిళలు చేతబడి చేశారని ఆ భూత వైద్యుడు చెప్పటంతో ఆగ్రహానికి లోనయ్యారు. 65 ఏళ్ల కరో, ఆమె కూతురు బసంతి దేవి(35)లను ఇంటి నుంచి లాక్కొచ్చి చితకబాదారు. అలా కొట్టుకుంటూ ఊరి చివరి చెరువు వరకు తీసుకెళ్లారు.
ఆపై అక్కడ వారితో మలం తినిపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భూత వైద్యుడితో పాటు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. మంత్రగాడి మాటలు విని తాము ఆ పని చేశామని నిందితులు చెప్పారు. మూఢ నమ్మకాలతో మూర్ఖపు పనులకు పాల్పడకండని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.