ముగ్గురిని మింగిన గుంత | Three Students Died By Drowned Into Water In Nizamabad | Sakshi
Sakshi News home page

ముగ్గురిని మింగిన గుంత

Jul 7 2019 10:50 AM | Updated on Jul 7 2019 11:50 AM

Three Students Died By Drowned Into  Water In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : విచ్చలవిడిగా సాగిన మొరం తవ్వకాల కారణంగా నిజామాబాద్‌ నగర శివారులోని నాగారం ప్రాంతంలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాలు ఇలా ఉన్నాయి. నాగారంలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో అదే ప్రాంతానికి చెందిన మహ్మద్‌అజార్‌ (8), షేక్‌ షోయబ్‌ (9)మూడో తరగతి, అర్బాజ్‌ ఖాన్‌ (11) నాల్గో తరగతి చదువుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నమజ్‌ కోసమని ముగ్గురు విద్యార్థులు పాఠశాల నుంచి బయటకు వచ్చారు.

నమాజ్‌ అనంతరం విద్యార్థులు పాఠశాల పక్కనే గతంలో మొరం తవ్వకాలు జరపడంతో ఏర్పడిన నీటి గుంతలో స్నానం చేసేందుకు దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగి చనిపోయారు. సాయంత్రమైనా విద్యార్థులు ఇంటికి రాకపోవండతో తల్లితండ్రులు కంగారుపడి పాఠశాలకు వెళ్లారు. అప్పటికే పాఠశాల మూసివేసి ఉంది. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ఫోన్‌ చేయగా స్పదించలేదు. విద్యార్థుల కోసం ఆరా తీసిన తల్లిదండ్రులు స్థానిక 5టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

స్పందించిన అదనపు డీసీపీ శ్రీధర్‌ రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్‌లు నాగారం ప్రాంతంలో పోలీసు సిబ్బందితో కలిసి గాలించారు. పాఠశాల ప్రాంతాన్ని పరిశీలించారు. చీకటి పడటంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. శనివారం ఉదయం నీటి గుంతలో ఓ విద్యార్థి శవం బయట పడటడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై జాన్‌రెడ్డి ఘటనా స్థలికి వెళ్లారు. ఫైరింజన్‌తో గుంతలోని నీటిని తోడేయించడంతో పాటు, గజ ఈతగాళ్లతో వెతికించగా మిగతా ఇద్దరి విద్యార్థుల మృత దేహాలు బయటపడ్డాయి. విద్యార్థుల మృతికి విద్యాశాఖ అధికారు నిర్లక్ష్యమే కారణమంటూ మృతుల బంధువులు ఆందోళనకు దిగారు.

మృతదేహాల తరలింపును అడ్డుకున్నారు. పోలీసులు సర్ది చెప్పి మృత దేహాలను  పోస్టుమార్టం కోసం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. అనంతరం విద్యార్థుల బంధువులు 5 టౌన్‌ పోలీసు స్టేషన్‌ ఎదుట రహదారిపై రాస్తారోకో చేశారు. విద్యార్థుల మృతికి విద్యాశాఖ అధికారులే కారణమంటూ ఆరోపించారు. విద్యార్థులు మధ్యాహ్నం పాఠశాల నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేనప్పుడు ఉపాధ్యాయులు ఎందుకు స్పదించలేదని, తల్లిదండ్రులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. డీఈవో దుర్గ ప్రసాద్‌ వచ్చి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పడంతో అందోళన విరమించారు.

ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌
ముగ్గురు విద్యార్థుల మృతి ఘటనలో ముగ్గురిపై జిల్లా విద్యాశాఖ చర్యలకు ఉపక్రమించింది. నాగా రంలో ముగ్గురు విద్యార్థులు నీటి కుంటలో పడి మృతిచెందిన ఘటనలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం ఉందని జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్‌ వా రిపై వేటు వేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో పాటు ఒక ఉపాధ్యాయుడి సస్పెండ్‌ చేశారు. మరో విద్యావలంటీర్‌ను తొలగించారు. హెచ్‌ఎం సిరాజ్, ఉపాధ్యాయుడు అజీజ్‌లను సస్పెండ్‌ చేస్తూ, విద్యా వలంటీర్‌ జలీల్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement