గంజాయి వ్యాపారులు అరెస్టు

Six Arrest In Marijuana Business - Sakshi

5.45 కేజీల గంజాయి, రూ.2,500 స్వాధీనం

ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం అరెస్టు వివరాలను సీఐ వెంకటశివారెడ్డి వెల్లడించారు. ఆర్టీపీపీ రోడ్డులోని చౌడమ్మ గుడి వెనుక గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో సీఐతో పాటు ఎస్‌ఐలు చిన్నపెద్దయ్య, ఖాన్‌ తమ సిబ్బందితో కలిసి దాడి చేశారు.

ఈ దాడిలో వీఎన్‌పల్లి మండలం గోనుమాకులపల్లె గ్రామానికి చెందిన లంగనూరు ఓబులేసు, ప్రొద్దుటూరులోని హైదర్‌ఖాన్‌ వీధికిచెందిన ఇస్మాయిల్, ఎర్రగుంట్ల బైపాస్‌ రోడ్డుకు చెందిన మజ్జారి పెద్దయ్య, మిట్టమడి వీధిలోని శివప్రసాద్, విజయనగరం వీధికి చెందిన ముద్దల వినతం పూర్ణచంద్, పెన్నానగర్‌కు చెందిన ఆవుల వెంకటయ్యను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 5.45 కేజీల గంజాయి, రూ.2,500 స్వాధీనం చేసుకున్నారు. ఓబులేసు, ఇస్మాయిల్‌ కలిసి రెండేళ్ల నుంచి గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్నారని, వీరు పట్టణంలోని యువకులు, వృద్ధులకు చిన్న చిన్న ప్యాకెట్లు చేసి వీటిని విక్రయిస్తున్నట్లు సీఐ తెలిపారు. దీంతో ఇటీవల ప్రొద్దుటూరులో గంజాయి సేవించే యువకుల సంఖ్య బాగా పెరిగిందన్నారు. వారిలో నేరప్రవృత్తి పెరుగుతోందన్నారు. ఎవరైనా గంజాయి విక్రయిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top