ఇన్‌ఫార్మర్‌ నెపంతో పోస్ట్‌మాస్టర్‌ హత్య | Postmaster Killedr By Maoist | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫార్మర్‌ నెపంతో పోస్ట్‌మాస్టర్‌ హత్య

Aug 10 2018 12:08 PM | Updated on Oct 9 2018 2:49 PM

Postmaster Killedr By Maoist - Sakshi

మావోయిస్టులు హత్య చేసిన పోస్ట్‌మాస్టర్‌ మృతదేహం

మల్కన్‌గిరి ఒరిస్సా : జిల్లాలోని చిత్రకొండ సమితి పప్పులూర్‌ పంచాయతీ కమల పొదర్‌ గ్రామంలో నివాసముంటున్న పోస్ట్‌మాస్టర్‌ నారాయణ పోలాకిని ఇన్‌ఫార్మర్‌ నెపంతో మావోయిస్టులు హత్య చేశారు. వివరాలిలా ఉన్నాయి. బుధవారం రాత్రి కొంతమంది మావోయిస్టులు గ్రామానికి వచ్చి పోస్ట్‌మాస్టర్‌ను పిలిచి తమవెంట అడవిలోకి తీసుకువెళ్లారు. అక్కడ ప్రజాకోర్టు నిర్వహించి నీవు పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నావు.

గతంలో పలుమార్లు హెచ్చరించినా నీ ధోరణి మార్చుకోలేదు. అందుకే నీకు మరణదండన విధిస్తున్నామని చెప్పి కాల్చి చంపారు. గురువారం తెల్లవారు జామున పోస్ట్‌మాస్టర్‌ మృతదేహాన్ని గ్రామ శివారులో పడవేశారు. మృతదేహం పక్కన ఓ లేఖను కూడా మావోయిస్టులు విడిచిపెట్టారు. తెల్లవారిన తరువాత అటుగా వెళ్లిన గ్రామస్తులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచార మిచ్చారు.

ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి అంతా పరిశీలించారు. పోస్ట్‌మాస్టర్‌ నారాయణ ఎటువంటి ఇన్‌ఫార్మర్‌ కాదు. మాకు ఎటువంటి సమాచారం అందించడం లేదు. ఇటువంటి అమాయకుల్ని హత్య చేస్తూ మావోయిస్టులు వారి ఉనికిని కాపాడుకునేందుకు కృషి చేస్తున్నారని ఎస్‌పీ జోగ్గామోహన్‌ మిన్నా ఈ సందర్భంగా అన్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement