బాలికల మిస్సింగ్ : అధికారులపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ : తూర్పు ఢిల్లీలోని సంస్కార్ ఆశ్రమ్ వసతి గృహం నుంచి తొమ్మిది మంది మైనర్ బాలికలు అదృశ్యమైన ఘటనలో ఇద్దరు మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులను ఢిల్లీ ప్రభుత్వం సోమవారం సస్పెండ్ చేసింది. ఈ ఘటన దురదృష్టకరమని, దీనికి బాధ్యులైన ఇద్దరు సీనియర్ అధికారులపై వేటు వేసినట్టు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.
బాలికల అదృశ్యంపై దర్యాప్తును తక్షణమే ఢిల్లీ పోలీస్ నేర విభాగానికి తక్షణమే బదలాయించాలని ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) డిమాండ్ చేసింది. దేశ రాజధానిలో కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కాగా ఢిల్లీలో మహిళలు, బాలికలకు సురక్షిత వాతావరణం కల్పించడంతో మహిళా శిశుసంక్షేమ శాఖ విఫలమైందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉన్నతాధికారుల తీరుతో శాఖపైనే సందేహాలు వెల్లడయ్యే పరిస్థితి ఎదురైందని అన్నారు.