వదినతో పెళ్లి.. ఆపై ఆత్మహత్య
సాక్షి, పట్నా : పెళ్లయిన రెండు రోజులకే పెళ్లి కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బీహార్లో కలకలం రేపుతోంది. ఈ ఆత్మహత్య గురించి భిన్న కథనాలు వినవస్తున్నా.. వదినను పెళ్లి చేసుకోవడంఇష్టంలేక.. అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. బీహార్లోని వినోబా నగర్లో 9వ తరగతి చదవుతున్న 15 ఏళ్ల మహదేవ కుమార్ బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తనకన్నా వయసులో పదేళ్లు పెద్దదయిన వదిన రూబీ దేవి(25)తో మూడు రోజుల కిందట మహదేవ్ కుమార్కు పెద్దలు వివాహం చేశారు. ఇది వరకే రూబీ దేవికి మహదేవ కుమార్ అన్న సంతోష్ కుమార్దాస్తో వివాహం జరిగింది. సంతోష్కుమార్ దాస్ 2013 కరెంట్ షాక్తగిలి మరణించడంతో.. మహదేవ్ కుమార్, రేబీ దేవికి మూడు రోజుల కిందట పెళ్లి చేశారు.
వదినను పెళ్లి చేసుకోవడం మహదేవ కుమార్కు ఏ మాత్రం ఇష్టం లేదని తెలిసింది. ఈ పెళ్లికి సమీప బంధువులు, గ్రామంలోని కొంత అభ్యంతరం వ్యక్తం చేసినా.. మహదేవ కుమార్ తల్లిదండ్రులు, రూబీ దేవి కుటుంబ సభ్యులు బలవంతంగా వివాహం జరిపించారు. ఇదిలా ఉండగా రూబీ దేవిని మహదేవ్ కుమార్ తన తల్లిలా భావించేవాడని అతని మిత్రులు చెబుతున్నారు.
ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ వివాహం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. సంతోష్ కుమార్ కరెంట్ షాక్తో చనిపోయినపుడు.. అతని కుటుంబానికి ప్రభుత్వం రూ. 80 వేలను ఇచ్చింది. ఈ మొత్తం తమకే కావాలని.. రూబీ దేవి కోరింది. అయితే సంతోష్ కుమార్దాస్ తండ్రి అయిన చండేశ్వర్దాస్ మాత్రం రూ. 27 వేలను ఇచ్చారు. ఈ క్రమంలోనే తన చిన్న కొడుకు అయిన మహదేవ్ కుమార్-రూబీ దేవిల పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదనను అందరూ అంగీకరించడంతో.. మూడు రోజులు కిందట ఇద్దరికీ పెళ్లి చేశారు. మహదేవ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.