వివాహిత గొంతు కోసి.. ఆపై ఆత్మహత్యాయత్నం  | A man try to kill women and commit suicide | Sakshi
Sakshi News home page

వివాహిత గొంతు కోసి.. ఆపై ఆత్మహత్యాయత్నం 

Sep 29 2018 4:36 AM | Updated on Nov 6 2018 8:08 PM

A man try to kill women and commit suicide - Sakshi

ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న రాజేశ్‌

అల్గునూర్‌ (మానకొండూర్‌): ఓ యువకుడు వివాహిత గొంతు కోసి.. ఆపై తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం అల్గునూర్‌ పంచాయతీ పరిధిలోని తమిళకాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కవిత, గణేశ్‌ దంపతులు. వీరి ఇంటి సమీపంలో రాజేశ్‌ నివాసం ఉంటున్నాడు. అయితే.. రాజేశ్‌ పుట్టు మూగ కావడంతో కవిత కొంత చనువుగా మెలిగేది. దీనిని అవకాశంగా తీసుకున్న రాజేశ్‌.. ఆమెను వేధించడం ప్రారంభించాడు. దీంతో మూడు నెలల క్రితం కవిత–గణేశ్‌ దంపతులు కాలనీ నుంచి ఇల్లు ఖాళీ చేసి.. రాజీవ్‌ రహదారి పక్కనే ఉన్న ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.

శుక్రవారం మధ్యాహ్నం కవిత ఇంటికి వచ్చిన రాజేశ్‌ బ్లేడ్‌తో ఆమెపై దాడి చేశాడు. బాధితురాలు కేకలు వేయడంతో భయంతో తను కూడా గొంతు కోసుకున్నాడు. స్థానికులు ఇద్దరినీ కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. రాజేశ్‌ సోదరి మాత్రం తన తమ్ముడిని కవిత వేధిస్తోందని, అసభ్యకరంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. తన తమ్ముడికి వచ్చే ఆసరా పింఛన్‌ కూడా తనే తీసుకునేదని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

వివాహేతర సంబంధమే కారణమా! 
కవిత, రాజేశ్‌ మధ్య కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. గతంలో రాజేశ్, కవిత ఇళ్లు పక్కపక్కనే ఉండటంతో ఇద్దరి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే.. ఈ విషయం గణేశ్‌ ఇంట్లో తెలియడంతో ఇంటిని ఖాళీ చేశారని తెలిసింది. ఈ క్రమంలో కవితను కలవడానికి వీలుకాకపోవడంతో ఆగ్రహానికి గురైన రాజేశ్‌.. శుక్రవారం ఆమెను కలుసుకునేందుకు వెళ్లాడు. బాధితురాలు విషయం బయటపడుతుందని వెళ్లిపోవాలని సూచించడంతో ఆగ్రహానికిలోనైన రాజేశ్‌ బ్లేడ్‌ తీసుకుని కవితపై దాడి చేసినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని ఎల్‌ఎండీ ఎస్‌ఐ నరేశ్‌రెడ్డి తెలిపారు.    

Advertisement
 
Advertisement
Advertisement