మరదలిపై వ్యామోహంతో భార్యను.. | Husband Who Murdered His Wife In Kurnool District Pyapili | Sakshi
Sakshi News home page

మరదలిపై వ్యామోహంతో భార్యను..

Jun 16 2020 10:35 AM | Updated on Jun 16 2020 10:35 AM

Husband Who Murdered His Wife In Kurnool District Pyapili - Sakshi

సాక్షి, కర్నూలు: తోడూనీడగా ఉండాల్సిన భర్తే.. అర్ధాంగి ఆయువు తీశాడు. మరదలిపై మోజు పెంచుకొని భార్యను కిరాతకంగా కడతేర్చాడు. ఈ దారుణం అలేబాదు తండాలో సోమవారం వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. బేతంచెర్ల మండలం గోరుమాను కొండ తండాకు చెందిన సుశీలబాయికి రెండేళ్ల క్రితం అలేబాదు  తండాకు చెందిన రవినాయక్‌తో వివాహమైంది. వారికి ఏడాది వయసున్న కుమార్తె ఉంది. కొద్దిరోజుల నుంచి సుశీలబాయి చెల్లిని వివాహం చేసుకొంటానని రవినాయక్‌ చెప్పేవాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య వాగ్వాదం నడిచేది.

భార్యను అంతమొందించాలని పథకం ప్రకారం.. ఆదివారం తనతో పాటు జీవాలు మేపేందుకు కొండకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను బండరాళ్లతో మోది చంపేసి మృతదేహాన్ని లోయలోకి తోశాడు. ఏమీ ఎరుగనట్లు ఇంటికి వచ్చి తన భార్య కనబడడంలేదని గ్రామస్తులకు చెప్పాడు. భార్య తల్లిదండ్రులకు ఇదే విషయాన్ని ఫోన్‌ చేసి చెప్పడంతో ఆందోళనకు గురై రాత్రికి రాత్రే గ్రామానికి చేరుకొని కుమార్తె కోసం గాలించారు. సుశీల బాయి మృతదేహం గ్రామ శివార్లలోని లోయలో పడి ఉండడాన్ని సోమవారం ఉదయం గమనించిన పశువుల కాపరులు విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. విషయం వెలుగులోకి రావడంతో నిందితుడు రవినాయక్‌ పరారయ్యాడు. హతురాలి తండ్రి సేవ్యా నాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రాచర్ల ఎస్‌ఐ నరేష్‌ తెలిపారు.

చదవండి: పెళ్లి చేసుకోమంటే.. నగ్న ఫోటోలతో బయపెడుతూ.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement