కటకటాల పాలైన కామపిశాచి  | Girl Kidnap Case In Ranga Reddy | Sakshi
Sakshi News home page

కటకటాల పాలైన కామపిశాచి 

Aug 5 2018 1:16 PM | Updated on Aug 5 2018 1:16 PM

Girl Kidnap Case In Ranga Reddy - Sakshi

ఉపాధ్యాయుడు అక్బర్‌

శంషాబాద్‌: విద్యాబుద్దులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు కామాంధుడిలా మారి  బాలికను మాయమాటలతో వంచించాడు. కొంతకాలం పాటు శారీరకంగా లొంగదీసుకున్న అతడి మోసాన్ని తల్లిదండ్రులు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పరారైన అతడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. శనివారం శంషాబాద్‌ ఏసీపీ అశోక్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు. షాబాద్‌కు చెందిన అక్బర్‌(52) శంషాబాద్‌ మండలంలోని ముచ్చింతల్‌ గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశాడు. అదే గ్రామానికి చెందిన బాలికను(17) మాయమాటలతో నమ్మించాడు. శారీరకంగా సైతం లొంగదీసుకున్నాడు. ఈ ఏడాది మే 8న బాలిక కనిపించకపోవడంతో తండ్రి కత్తుల నర్సింహ ఉపాధ్యాయుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

కిడ్నాప్‌ కేసు నమోదు చేసిన పోలీసులకు బాలిక ఆచూకీ కనుగొని విచారించడంతో అక్బర్‌ మోసాలు బయటపడ్డాయి. నమ్మించి తనను శారీరకంగా లొంగదీసుకున్నాడని వివరించడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలో విషయం తెలుసుకున్న అక్బర్‌ సొంత గ్రామం నుంచి పరారయ్యాడు. కర్నాటకలోని పలు ప్రాంతాల్లో దాక్కున్నాడు. అతడికి వరసకు అల్లుడయ్యే ఇమ్రాన్‌ సహకరిస్తుండడంతో ఫోన్‌ నంబర్లు మార్చుతూ అక్కడే గడిపాడు. రెండు రోజుల కిందట హైదరాబాద్‌కు వస్తున్న అక్బర్‌ను పోలీసులు షాద్‌నగర్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతడికి సహకరించిన ఇమ్రాన్‌ను సైతం అదుపులోకి తీసుకుని శనివారం రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement