డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పిస్తానని మోసం
నిందితుడి అరెస్ట్
బహదూర్పురా: డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తానని రూ.3.5 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యక్తిని బహదూర్పురా పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. షనవాజ్ బేగం, సయ్యద్ రషీద్ దంపతులు, సయ్యద్ రషీద్కు కిషన్బాగ్కు చెందిన ఖాజా అలీముద్దీన్తో పరిచయం ఉంది. కిషన్బాగ్లో తక్కువ ధరకు డబుల్ బెడ్రూం ఇంటిని ఇప్పిస్తానని ఆలీముద్దీన్ సయ్యద్ రషీద్కు చెప్పాడు. సెక్రటేరియట్లో పని చేసే రషీద్ ఆలియాస్ అమేర్ ద్వారా తక్కువ ధరకు ఇంటిని ఇప్పిస్తామన్నారు. అతడి మాటలు నమ్మిన షనవాజ్ బేగం, సయ్యద్ రషీద్ అలీముద్దీన్కు 2016లో రూ.2 లక్షల నగదు ఇచ్చారు.
రెండు నెలల తర్వాత మిగతా డబ్బులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో రెండు దఫాలుగా రూ.3.50 లక్షలు చెల్లించారు. ఏళ్లు గడుస్తున్నా ప్లాట్ ఇప్పించకపోవడంతో అలీముద్దీన్ను నిలదీశారు. అప్పటి నుంచి అతను తప్పించుకు తిరుగుతుండటంతో అనుమానం వచ్చిన బాధితులు విచారించగా అలీముద్దీన్ స్నేహితుడైన రషీద్ ఆలియాస్ అమేర్ సెక్రటేరియట్లో పని చేయడం లేదని తెలిసింది. తాము మోసం పోయినట్లు గుర్తించిన బాధితులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అలీముద్దీన్ను కోరగా, ఫోన్ స్విచాఫ్ చేసుకుంటూ తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో బాధితులు సోమవారం బహదూర్పురా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని ఖాజా అలీముద్దీన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
సంబంధిత వార్తలు