కత్తులతో వీరంగం కేసులో నిందితుల అరెస్ట్‌

Five Members Arrested in Knife Attack Case Hyderabad - Sakshi

చాంద్రాయణగుట్ట: మారణాయుధాలతో నడి రోడ్డుపై హల్‌చల్‌ చేసిన ఘటనలో ఐదుగురు నిందితులను ఫలక్‌నుమా పోలీసులు అరెస్ట్‌ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఫలక్‌నుమా ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాసరావుతో కలిసి ఏసీపీ డాక్టర్‌ ఎం.ఎ.రషీద్‌ వివరాలు వెల్లడించారు. నవాబ్‌ సాహెబ్‌ కుంట ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఇస్మాయిల్, మీర్జా ఖాదర్‌ బేగ్, కాలాపత్తర్‌కు చెందిన ఇమ్రాన్‌ అహ్మద్, బహదూర్‌పురాకు చెందిన గులాం ముస్తఫా, కాలాపత్తర్‌కు చెందిన మహ్మద్‌ హుస్సేన్‌ మరో ఇద్దరితో కలిసి ముఠాగా ఏర్పడి రౌడీయిజం చేస్తున్నారు. ఈ నెల 1వ తేదీ రాత్రి వీరు నవాబు సాహెబ్‌కుంటలో కత్తులు, బ్యాట్లతో హల్‌చల్‌ చేస్తూ ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురి చేశారు. దీనిపై సమాచారం అందడంతో కాలాపత్తర్, ఫలక్‌నుమా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోగా వారు అక్కడినుంచి పరారయ్యారు. ఇద్దరు నిందితులను ఇప్పటికే అరెస్ట్‌ చేసిన కాలాపత్తర్‌ పోలీసులు మిగిలిన ఐదుగురిని మంగళవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి కత్తులు, బ్యాట్లను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎస్సైలు ఎల్‌.రమేష్‌ నాయక్, కె.గొకారీ తదితరులు పాల్గొన్నారు. 

హత్యకు కుట్ర  
కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్‌ ఇస్మాయిల్‌ వరుసకు సోదరుడయ్యే ఇర్షాద్‌ను హత్య చేసేందుకు పథకం పన్నాడు. దుబాయిలో ఉంటూ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఇర్షాద్‌ వద్ద రూ.కోట్లు ఉన్నందున అతడిని హత్య చేసి అతని ఆస్తులను కాజేయాలని ఇస్మాయిల్‌ భావించాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 1న రాత్రి అతడి ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు.ఇర్షాద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం నిందితులను అరెస్ట్‌ చేశారు. 

నిందితులపై పలు కేసులు
నిందితులపై గతంలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇస్మాయిల్‌ కాలాపత్తర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన హత్య కేసులో ఐదేళ్లు జైలుకు వెళ్లి వచ్చాడు. మరో నిందితుడు మిర్జా ఖదీర్‌ బేగ్‌ అక్రమ ఆయుధాల కేసు ఉండగా, మూడో నిందితుడు ఇమ్రాన్‌పై మూడు కేసులు ఉన్నట్లు ఏసీపీ వివరించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top