మంటగలిసిన మానవత్వం | Elderly Women Died With Heart Stroke in Tamil Nadu Bus | Sakshi
Sakshi News home page

మంటగలిసిన మానవత్వం

Feb 19 2019 12:17 PM | Updated on Feb 19 2019 12:17 PM

Elderly Women Died With Heart Stroke in Tamil Nadu Bus - Sakshi

మృతి చెందిన వృద్ధురాలు భూషణం (ఫైల్‌) బస్‌స్టాప్‌లో మృతదేహాన్ని వదిలి వెళ్లిన దృశ్యం

గుండెపోటుకు గురైన వృద్ధురాలిని బస్సు నుంచి కిందికి దింపేసిన వైనం

తమిళనాడు, వేలూరు: కాట్పాడి సమీపంలో బస్సులో ప్రయాణిస్తుండగా గుండెపోటుకు గురై వృద్ధురాలు మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని బస్‌స్టాప్‌లో వదిలివెళ్లిన సంఘటన పలువురిని కలచివేసింది. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా సెయ్యారుకు చెందిన భూషణం (60). ఈమె బెంగళూరులోని బంధువుల ఇంటికి వెళ్లి ఆదివారం సాయంత్రం రైలు ద్వారా కాట్పాడికి తిరిగి వచ్చారు.

కాట్పాడి రైల్వేస్టేషన్‌లో దిగిన ఆమె వేలూరు కొత్త బస్టాండ్‌కు వెళ్లేందుకు బస్సులో ప్రయాణం చేశారు.  కాట్పాడి చిత్తూరు బస్టాండ్‌ వద్ద వస్తున్న సమయంలో బస్సులోనే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. దీన్ని గమనించిన బస్సు కండెక్టర్‌ వెంటనే ఆమెను కిందకు దింపారు. బస్సు నుంచి కింద దిగిన భూషణం కొద్ది క్షణాల్లోనే మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని బస్‌స్టాప్‌లోనే వదిలిపెట్టి బస్సు బయలుదేరి వెళ్లింది. విషయం తెలుసుకున్న కాట్పాడి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతురాలి బ్యాగులో తనిఖీ చేయగా ఆమె కుటుంబ సభ్యుల ఫోన్‌ నెంబర్‌ తెలుసుకొని వారికి సమాచారం అందించారు. అనంతరం కుటుంబసభ్యులు అక్కడికి రావడంతో మృతదేహాన్ని వారికి అప్పగించారు. గుండెపోటుకు గురైన వృద్ధురాలిని కిందకు దింపి వెళ్లిపోయిన బస్సు కండక్టర్, డ్రైవర్‌ ఎవరు, ఏ బస్సు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. వృద్ధురాలికి గుండెపోటు వచ్చిన వెంటనే అంబులెన్స్‌ను రప్పించి ఆస్పత్రిలో చేర్పించాల్సిన బస్సు డ్రైవర్, కండెక్టర్‌లు బస్‌స్టాప్‌లో వదిలి పెట్టి వెళ్లిన సంఘటన పలువురిని కలచివేసింది.

Advertisement
 
Advertisement
Advertisement