ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. లక్షల్లో టోకరా

సాక్షి, నాగోలు: ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ. లక్షల్లో నగదు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఓ వ్యక్తిపై చీటింగ్‌ కేసు నమోదైంది. ఈ సంఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం..గౌరీశంకర్‌ అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా కోర్టు, పలు ప్రభుత్వ కార్యాలయాలలో అటెండర్, ఇతర ఉద్యోగాలు ఇప్పిస్తానని హస్తినాపురం సెంట్రల్‌ ఇంద్రప్రస్త కాలనీకి చెందిన జి.చంద్రమోహన్‌తో పాటు మరికొంత మందిని నమ్మించి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశాడు.

ఉద్యోగం ఇప్పించక పోగా తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు తెలుసుకున్న బాధితులు చంద్రమోహన్, సందీప్, హరినాథ్‌, ఉమామహేందర్, రవికిరణ్, వినోద్‌గౌడ్, సరిత, భవాని, శ్రీనివాస్, శివ, సత్యనారాయణతో పాటు మరికొంత మంది కలిసి ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో గౌరీశంకర్‌పై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గౌరీశంకర్‌ సుమారు రూ. 25 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top